హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్సీ పదవి నుంచి మహేంద్ర సింగ్ ధోనిని తప్పించడం తనను తీవ్రంగా బాధించిందని గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు.
'నేను చాలా నిరాశ చెందా. దేశంతో పాటు ఐపీఎల్ జట్లకు విశేష సేవలందించాడు. అతడిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇది తానొక్కడ్నే అంటున్న మాట కాదు. యావత్ ప్రపంచం అంటున్న మాట' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో రైనా అన్నాడు.
ఒక జట్టుకు కెప్టెన్గా ఉన్న వ్యక్తిని ఉన్న పళంగా తప్పించడం ఎంతమాత్రం సమంజసం కాదని రైనా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ పదో సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లాడిన ధోని కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ధోని ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'ధోనిని కెప్టెన్సీ పదవి నుంచి తీసేస్తూ పుణె యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నన్ను నిరాశకు గురి చేయడమే కాదు.. బాధించింది కూడా. దేశానికి ధోని చాలా చేశాడు. జాతీయ క్రికెట్ జట్టుకు ఎంత సేవ చేశాడో, అదే స్థాయిలో ఐపీఎల్ పురోగతికి దోహదపడ్డాడు. క్రికెట్కు ఎంతో చేసిన వ్యక్తికి కచ్చితంగా గౌరవం ఇవ్వాలి' అని రైనా పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా గతంలో ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన మధుర క్షణాల్ని రైనా గుర్తు చేసుకున్నాడు. తాను చెన్నై సూపర్ కింగ్స్తో గడిపిన క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకమని రైనా చెప్పుకొచ్చాడు. చెన్నై తరపున అనేక ట్రోఫీలను అందుకున్నామని, అప్పడు యువ క్రికెటర్గా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అన్నాడు.