హైదరాబాద్: ఐపీఎల్ వేలంలో ధోని అందుబాటులో ఉంటే అతన్ని కొనుగోలు చేసేందుకు తన పైజామాను కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ కింగ్, కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ వ్యాఖ్యానించాడు. ధోని లాంటి కీలక ఆటగాడు ముందు వేలానికి వస్తే ఎటువంటి ఆలోచనా లేకుండా తన జట్టులోకి తీసుకుంటానని అన్నాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ధోనీని కోల్కతా జర్సీలో చూడాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ ధోని వేలంలో అందుబాటులో ఉంటే తన పైజామా అమ్మైనా సరే దక్కించుకుంటానని అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు షారుఖ్ ఖాన్. ప్రస్తుతం సీజన్లో ధోని ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు.
ఈ నేపథ్యంలో అతని ఆటతీరుపై పలువురు మాజీలు ఇప్పటికే విమర్శలు చేశారు. అయినప్పటికీ ధోనీని తన జట్టులోకి తీసుకుంటానని షారుఖ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'ధోనిని ముందు ఐపీఎల్ వేలం పాటలోకి రానివ్వండి. అతన్ని సొంతం చేసుకోవడం కోసం నా పైజామాలు అమ్మేస్తా. ధోనిని కోల్కతా నైట్ రైడర్స్ జెర్సీలో చూడాలనుకుంటున్నా. ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలోకి ధోని వస్తే మాత్రం అతన్ని ఎలాగైనా దక్కించుకుంటా' అని షారుక్ అన్నాడు.
ఇదిలా ఉంటే ధోనీని మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో చూస్తారని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే ఐపీఎల్లో నిషేధానికి గురైన ఐపీఎల్ జట్లు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రీ ఎంట్రీ ఇస్తున్నాయి.
ఈ క్రమంలో ధోనిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.