హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో పంజాబ్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ నమ్మకాన్ని ఇషాంత్ శర్మ నిలబెట్టుకోలేకపోయాడా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఇషాంత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ పదో సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఇషాంత్ శర్మను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ మెంటార్, డైరెక్టర్గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒత్తిడి తేవడంతోనే ఇషాంత్కు అవకాశం వచ్చింది.
పంజాబ్ జట్టులో సందీప్ శర్మ, మోహిత్ శర్మ లాంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ పేస్ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇషాంత్ శర్మను సెహ్వాగ్ జట్టులోకి తీసుకున్నాడు. అంతేకాదు కేవలం బౌలర్గా ఉన్న ఇషాంత్ శర్మను ఎవరైనా కొంటారా? అంటూ గంభీర్ వ్యాఖ్యలు చేస్తే ఆగ్రహం వ్యక్తం చేసి ఇషాంత్ను వెనకేసుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఇషాంత్ ప్రాధమిక ధర రూ. 2 కోట్లు చెల్లించి పంజాబ్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. అయితే ఈ సీజన్లో కేవలం ఆరు మ్యాచ్ల్లో మాత్రమే ఇషాంత్కు తుది జట్టులో చోటు దక్కింది. ఆరు మ్యాచ్ల్లో మొత్తం 18 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
బౌలర్గానే కాకుండా ఫీల్డర్గా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాదు ఒక సీజన్లో అత్యధిక బంతులు(108) వేసి వికెట్ దక్కించుకోలేకపోయిన బౌలర్గా ఓ చెత్త రికార్డును కూడా ఇషాంత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. సెహ్వాగ్ అంతలా పట్టుబట్టి మరీ జట్టులోకి తీసుకుంటే, నమ్మకాన్ని నిలబెట్టకపోగా.. అతడి పరువు తీశాడని సెహ్వాగ్ అభిమానులు విమర్శించారు.