హైదరాబాద్: పూణె టెస్టులో టీమిండియా ఆటతీరుపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టుల సిరిస్లో భాగంగా జరగనున్న రెండో టెస్టులోని భారత తుది జట్టులో మార్పులు అవసరమని అజారుద్దీన్ సూచించాడు. జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మలను తప్పించాలని అభిప్రాయపడ్డాడు.
'పూణెలో ఆట తీరును బట్టి అదనపు బ్యాట్స్మన్ అవసరం. జయంత్ యాదవ్ స్థానంలో కరుణ్ నాయర్ను తీసుకుంటారని ఆశిస్తున్నాను' అని అజారుద్దీన్ చెప్పాడు. పూణె టెస్టులో రెండు ఇన్నింగ్స్లు కలిపి టీమిండియా కేవలం 75 ఓవర్లు మాత్రమే ఆడిన సంగతి తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్లో 105 పరుగులు చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్లో 107 పరుగులకే ఆలౌటైంది. ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ని ఆస్ట్రేలియన్లు మూడు రోజులకే ముగించడంతో భారత్ 333 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇక ఇషాంత్ శర్మ బౌలింగ్పై కూడా అజారుద్దీన్ స్పందించాడు. 'ఇషాంత్ శర్మ బౌలింగ్ కూడా ప్రభావం చూపడం లేదు. అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్ వంటి స్వింగ్ బౌలర్ను విరాట్ కోహ్లీ జట్టులోకి తీసుకోవాలి' అని సూచించాడు.
బ్యాటింగ్కు అనుకూలం కాని పూణె పిచ్పై భారత స్పిన్నర్లు ప్రదర్శనపై అసంతృప్తిని వ్కక్తం చేశాడు. ముఖ్యంగా రవీంద్ర జడేజా గురించి ప్రస్తావించాడు. సిరీస్ కోల్పోయినట్లు భావించడం లేదని, ఎటువంటి పిచ్పై ఆడుతున్నామన్నది చూడాలని అన్నాడు.
ఇదిలా ఉంటే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మార్చి 4వ తేదీ నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.