రాంచీ: మ్యాచ్ ఫినిషర్ జాబ్ అనేది అంత సులభమైనది కాదని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ధోని మీడియాతో మాట్లాడాడు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషిర్గా బాధ్యతలు తీసుకోవడం అత్యంత కఠినమైన పనుల్లో ఒకటిగా ధోని పేర్కొన్నాడు. నాలుగో వన్డేలో వికెట్పై బ్యాటింగ్ ఆర్డర్ కిందకు వెళుతున్న కొద్ది బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని ధోని తెలిపాడు.
ముఖ్యంగా రాంచీ లాంటి స్లో వికెట్పై లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయని అన్నాడు. ఓపెనర్ రహానే 57 పరుగులతో జట్టును విజయం వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక రెండో వికెట్గా వచ్చిన కోహ్లీ.. రహానేతో 45 పరుగులతో 79 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు.
మళ్లీ ధోని మ్యాజిక్ చేశాడు: ఆ రనౌట్ నాలుగో వన్డేకే హైలెట్
మిడిల్ ఆర్డర్లో భారత ఆటగాళ్లకు అనుభవం తక్కువ అయిన నేపథ్యంలో భారత్ ఓటమి పాలైందా? అన్న ప్రశ్నకు గాను రాంచీ లాంటి వికెట్పై అనుభవం తక్కువగా ఉన్న మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లకు లక్ష్యాన్ని ఛేదించడం కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదు, ఆరు స్థానాల్లో ఆడుతున్న కుర్రాళ్లు కొత్తవాళ్లని అన్నాడు.
అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వారి సహజసిద్ధమైన ఆటకు ఎప్పుడూ నిబంధనలు విధించకూడదన్నాడు. నెమ్మదిగా ఎలా ఆడాలో వాళ్లే నేర్చుకుంటారు. భారీ షాట్లు ఆడొద్దని వారికి చెప్పకూడదు. వారి పరిధిలో బంతి పడగానే షాట్లు ఆడుతున్నారు. ఒకవేళ వారు తప్పులు చేస్తే అనుభవపూర్వకంగా నేర్చుకుంటారని చెప్పాడు.
15 నుంచి 20 మ్యాచ్లు ఆడిన తర్వాత వారికి ఆటపై ఒక అవగాహన వస్తుందని, ఆ తర్వాత వారికి ఏది మంచిదని అనిపిస్తే అదే చేస్తారని ధోని పేర్కొన్నాడు. ఈ మేరకు ఆ ఆటగాళ్ల ప్రదర్శనకు మరికొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నాడు.
ఆశలు రేపి తుస్సుమనిపించారు: 4వ వన్డేలో భారత్ ఓటమి
ఈ మ్యాచ్లో లక్ష్యం పెద్దగా లేకపోయినప్పటికీ, సరైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతోనే ఓటమి పాలయ్యామని ధోని తెలిపాడు. స్లో వికెట్ పై స్ట్రైక్ రొటేట్ చేయడం కష్టంగా మారిందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తొలి 10 ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చేశామని అన్నాడు.
ఈ వికెట్పై 230 లక్ష్యమైతే బాగుండేదని, 260 పరుగులైనా వికెట్లు చేతిలో ఉండే లక్ష్యాన్ని సులభంగా ఛేదించేవాళ్లమని, అయితే స్ట్రయిక్ రొటేట్ చేసే క్రమంలో వికెట్లను కోల్పోయామని పేర్కొన్నాడు. మధ్యాహ్నంతో పోలిస్తే పిచ్ సాయంత్రానికి బాగా నెమ్మదించిందని ధోని పేర్కొన్నాడు.