హైదరాబాద్: భారత జట్టులో యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ల కంటే సురేశ్ రైనానే గొప్ప ఫీల్డర్ అని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ వ్యాఖ్యానించాడు. చెన్నైలోని వేలమ్మాళ్ విద్యాలయాన్ని జాంటీ రోడ్స్ బుధవారం సందర్శించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్స్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఈ సందర్భంగా విద్యార్ధులు భారత జట్టులో గొప్ప ఫీల్డర్ ఎవరని ప్రశ్నించారు. 'యువరాజ్, కైఫ్లు మంచి ఫీల్డర్లే. కోహ్లీ ఫర్వాలేదు. కానీ భారత క్రికెటర్లలో సురేశ్ రైనానే గొప్ప ఫీల్డర్. మైదానంలో బంతి కోసం చాలా చురుగ్గా కదులుతాడు' అని రోడ్స్ తెలిపాడు.
జాంటీ రోడ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకి ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్లో ఆటగాళ్లందర్నీ దగ్గరి నుంచి గమనించానని జాంటీ రోడ్స్ ఈ సందర్భంగా తెలిపాడు. 'బంతి కోసం పరిగెత్తుతాడు. యువ జాంటీ రోడ్స్లా రైనా నన్నే తలపిస్తాడు' అని అన్నాడు.