బెంగుళూరు : బౌలర్ గా కెరీర్ లో ఎన్నో మైళ్లు రాళ్లను అందుకున్న ముత్తయ్య మురళీధరన్, కోచ్ గా మొదటిసారి ఓ టీమ్ ని విజేతగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఆదివారం నాడు ఐపీఎల్-9 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్యన జరిగిన ఫైనల్ మ్యాచ్ లో, ఫలితాన్ని సన్ రైజర్స్ వైపుకు తిప్పడంలో బౌలర్ల పాత్ర ప్రశంసనీయమైంది.
అయితే.. సన్ రైజర్స్ బౌలర్ల సక్సెస్ వెనుక టీమ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కృషి దాగుంది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి ఇద్దరూ చెలరేగుతున్న సమయంలో.. సన్ రైజర్స్ బౌలర్లకు మురళీధరన్ చెప్పిన 'సక్సెస్ మంత్ర' మ్యాచ్ ని సన్ రైజర్స్ వైపుకు మొగ్గేలా చేసింది.
ఇంతకీ సన్ రైజర్స్ బౌలర్లకు మురళీధరన్ చెప్పిన ఆ సక్సెస్ మంత్ర ఏంటంటే..! 'జస్ట్ కామ్ డౌన్' మౌనంగా మీ పని మీరు చేసుకుపోండి అంటూ సలహా ఇచ్చాడట. కోహ్లి, గేల్ ను అవుట్ చేయగలిగితే, చేయాల్సిన రన్ రేట్ పెరుగుతుంది, కాబట్టి మీరు మీ మూలాలకు కట్టుబడి బౌలింగ్ చేయండంటూ భువనేశ్వర్, ముస్తఫిజుర్ సహా మిగతా బౌలర్ల వెన్ను తట్టి ప్రోత్సాహించాడట.
కోచ్ మురళీధరన్ చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టిన సన్ రైజర్స్ బౌలర్లు అనుకున్న ఫలితాన్ని రాబట్టారు. దీంతో మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన మురళీధరన్.. నిజానికి 200 పరుగులను సాధించడమనేది మంచి స్కోర్, కానీ వాళ్ల టీమ్ లో ప్రమాదకర బ్యాట్స్ మెన్ ఉన్నారు. అయినా సరే భువనేశ్వర్, ముస్తఫిజుర్ రూపంలో మాకున్న అద్భుతమైన బౌలర్లు వాళ్లను కట్టడి చేయగలిగారంటూ కితాబిచ్చాడు.
అలాగే టీమ్ ఫైనల్ వరకు రావడం, ఫైనల్ లో గెలుపొందడం వెనుక కెప్టెన్ వార్నర్ పాత్ర హర్షనీయమని చెప్పాడు. మొత్తానికి సన్ రైజర్స్ గెలుపు కోచ్ గా తన కెరీర్ లో చాలా ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు 44 ఏళ్ల మాజీ బౌలింగ్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్.