న్యూఢిల్లీ: దేశంలోని క్రికెటర్ల కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ సూచించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రక్షాళన కోసం లోథా కమిటీ కొన్ని సూచనలు చేసింది. బీసీసీఐ ఐపీఎల్కు స్వతంత్ర్య సంఘాలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
అంతేకాదు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు పరిమితంగా స్వయం ప్రతిపత్తి ఉండాలని ప్రతిపాదించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో 9 మంది సభ్యులుండాలని, బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేసిన లోథా కమిటీ ఈ మేరకు రూపొందించిన తుది నివేదికను సోమవారం సుప్రీంకోర్టు, బీసీసీఐకి సమర్పించింది.
బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా మంత్రులు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండరాదని, బీసీసీఐ అధ్యక్షుడి పదవీ కాలం రెండేళ్లకు మించకూడదని నివేదికలో పేర్కొంది. బీసీసీఐను సమాచార హక్కు చట్టం కిందకు తీసుకురావాలని కూడా సూచించింది. ప్రస్తుతం బీసీసీఐ సొసైటీస్ యాక్ట్ కిందకు వస్తుంది.
ఆ చట్టం ప్రకారం బీసీసీఐ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు కేంద్ర క్రీడల శాఖ నుంచి కూడా బీసీసీఐ ఎటువంటి నిధులను పొందడం లేదు. అయితే బీసీసీఐ వ్యవహారాలపై దేశ ప్రజలకు పూర్తి సమాచారం తెలుపాల్సిన అవసరం ఉంది కనుక, ఆ సంఘాన్ని ఆర్టీఐ కిందకు తీసుకురావాలని లోథా కమిటీ సూచించింది.
అంతేకాదు క్రికెట్ బెట్టింగ్ను కూడా చట్టపరం చేయాలని పేర్కొంది. ఇకపై క్రికెట్ ఆటగాళ్లు కానీ, మ్యాచ్ అధికారులను కానీ బెట్టింగ్లో పాల్గొనరని కమిటీ గట్టిగా నమ్ముతుందన్నారు. కానీ ఆటగాళ్లు, అధికారులు తమ ఆస్తులను వెల్లడించాల్సిన అవసరం ఉంటుందని లోథా కమిటీ పేర్కొంది.
క్రికెట్లో బెట్టింగ్ కోసం పకడ్బందీగా ఉండే స్వయం నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని సూచించింది. జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఎక్కువ టెస్టుల ఆడిన ప్లేయర్నే నియమించాలని పేర్కొంది.