కింగ్స్టన్: తొలి టెస్టు భారీ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా ఆటగాళ్లు రెండో టెస్టులో మరింత దూకుడుగా ఆడుతున్నారు. వెస్టిండీస్తో కింగ్స్టన్ సబీనా మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు భారత బౌలర్లు సత్తా చాటారు. వెస్టిండీస్ను కేవలం 196 పరుగులకే కుప్పకూల్చారు.
భారత బౌలర్లలో అశ్విన్(5/52) మరోసారి అద్భుత ప్రదర్శన చేయగా, ఇషాంత్, షమీలు కూడా తమవంతు పాత్ర పోషించారు. షమి (2/23), ఇషాంత్ శర్మ(2/53) మిశ్రా (1/38) రాణించడంతో వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. విండీస్ బ్యాట్స్మెన్లలో బ్లాక్వుడ్(62) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 126/1తో నిలిచింది.
భారత బౌలర్ల దూకుడుకు విండీస్ తడబాటు
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ఆది నుంచీ తడబడుతూనే ఉంది. తొలి టెస్టులో విఫలమైన ఇషాంత్ శర్మ.. బౌన్స్కు సహకరిస్తున్న పిచ్పై నిప్పులు చెరిగే బంతులతో విజృంభించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బంతుల్లో బ్రాత్వైట్ (1), డారెన్ బ్రావో (0)లను పెవిలియన్ చేర్చాడు.
ఇషాంత్ తోపాటు విండీస్ను దెబ్బ కొట్టాడు షమి. ఆరో ఓవర్లో అతను చంద్రిక (5)ను ఔట్ చేశాడు. దీంతో 7/3తో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల వూపు.. విండీస్ బ్యాట్స్మెన్ తడబాటు చూస్తే ఆతిథ్య జట్టు వంద పరుగులైనా చేస్తుందా.. ఇన్నింగ్స్ లంచ్ లోపే ముగిసిపోతుందా అన్న సందేహాలు కలిగాయి. ఈ దశలో శామ్యూల్స్ 37(88 బంతుల్లో 5×4, 2×6), బ్లాక్వుడ్ 62 (62 బంతుల్లో 7×4, 4×6) పరుగులతో రాణించి విండీస్ను ఆదుకున్నారు.
బ్లాక్వుడ్.. మరింత ప్రమాదకరంగా మారుతున్న దశలో అశ్విన్ అతడికి చెక్ పెట్టాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లలో బ్లాక్వుడ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంచ్ విరామానికి స్కోరు 88/4. విరామం తర్వాత శామ్యూల్స్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అతణ్ని అశ్విన్ ఔట్ చేశాడు.
ఆ తర్వాత చేజ్ (10), డౌరిచ్ (5) కూడా వెనుదిరిగారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన మిగిలిన బాట్స్మెన్లు కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జాసన్ హోల్డర్ (13), బిషూ(12), గాబ్రియెల్(15) వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో 196 పరుగులకే ఆలౌటయ్యింది.
రాణించిన భారత ఓపెనర్లు
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత ఓపెనర్లు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ రాహుల్ దూకుడుగా ఆడి 58 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతున్న వీరి భాగస్వామ్యాన్ని చేజ్ విడదీశాడు.
శిఖర్ ధావన్(27) బ్రావోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లోకేష్ రాహుల్ 75 (114), పుజరా 18(57) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 37 ఓవర్లకు వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది.