హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్తో ముగిసిన మ్యాచ్లో ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు.
బుధవారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్తో జరిగిన మ్యాచ్లో ఊతప్ప 47 బంతుల్లో 87 పరుగులతో కోల్కతా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న సందర్భంగా రాబిన్ ఊతప్ప మీడియాతో మాట్లాడాడు.
గ్రౌండ్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వికెట్ కీపింగ్ను పరిశీలిస్తూ అతని దగ్గరి నుంచి తాను కొన్ని మెళకువలను నేర్చుకుంటున్నట్లు చెప్పాడు. 'వికెట్ కీపింగ్లో భారత క్రికెటర్ల కోసం ధోని బెంచ్మార్క్ను సెట్ చేశాడని భావిస్తున్నాను. ఆ మార్క్ను అందుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాను' అని ఊతప్ప అన్నాడు.
#IPL @robbieuthappa doesn’t mind learning a thing or two from @msdhoni #RPSvKKR #SpiritOfCricket pic.twitter.com/ohF5ImRpyG
— IndianPremierLeague (@IPL) 26 April 2017
ఈ సీజన్లో ఏడు మ్యాచ్లాడిన ఊతప్ప మూడు అర్ధ సెంచరీలతో మొత్తం 272 పరుగులతో టాప్-6 బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. 'ఐపీఎల్లో ఈ ఫామ్ని ఇలానే కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నా. ఎందుకంటే మళ్లీ భారత్ జట్టుకి కనీసం టెస్టు ఫార్మాట్లోనైనా ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. అలా అని నేను ఏమీ ఒత్తిడికి గురవడం లేదు. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగితే నా డ్రీమ్కి చేరువైనట్లే కదా. శ్రమకి ఎప్పటికైనా ఫలితం దక్కుతుందని నమ్మే వ్యక్తిని నేను' అని ఊతప్ప ధీమా వ్యక్తం చేశాడు.