హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాకి తొలి టెస్టుకి ముందే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా రెగ్యులర్ టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ జట్టుకి దూరమవగా, తాజాగా జ్వరం కారణంగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
ఇటీవల ముగిసిన వార్మప్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్ వ్ర జ్వరం కారణంగా జట్టుతో కలిసి గాలేకి వెళ్లకుండా కొలంబోలోనే ఉండిపోయాట. గాలే స్టేడియం వేదికగా తొలి టెస్టు బుధవారం నుంచి ఆరంభం కానుంది. అనంతరం ఆగస్టు 3 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది.
జ్వరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సోమవారం ప్రాక్టీస్ సెషన్ను కూడా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్లో గాయపడిన కేఎల్ రాహుల్.. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీంతో ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమై దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు.
అనంతరం శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్కి ఎంపికయ్యాడు. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 58 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి మునుపటి ఫామ్ను అందుకున్నాడు. అనారోగ్యం కారణంగా తొలి టెస్టుకి కేఎల్ రాహుల్ దూరమైతే శిఖర్ ధావన్తో కలిసి అభినవ్ ముకుంద్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు.
మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్కి సెలక్టర్లు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు గాను కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది.