హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కో్హ్లీ సేన లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లు సరికొత్త రికార్డు నెలకొల్పారు.
మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో అత్యధిక అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా అరుదైన ఘనత సాధించారు. జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఇక్కడ అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడీగా రాహుల్-ధావన్లు నిలిచారు.
అంతేకాదు గత నాలుగేళ్లలో శ్రీలంకతో వంద అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో ఓపెనింగ్ జోడిగా ధావన్-రాహుల్ గుర్తింపు పొందారు. వీరికి ముందు బంగ్లాదేశ్ ఓపెనర్లు సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్లు శ్రీలంకలో 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తొలి సెషన్లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐదుగురు బౌలింగ్ చేసినప్పటికీ భారత్ ఓపెనర్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తొలుత 45 బంతుల్లో ధావన్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత 67 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు.