న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుత ఫాంతో అత్యధిక పరుగులు చేయడంతోపాటు తమ జట్టును ఫైనల్ వరకు చేర్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు టీమిండియా మాజీ డైరెక్టర్ రవి శాస్త్రి. అంతేగాక, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పదవికి కూడా ఎసరు పెట్టారు.
అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించే సత్తా ఉందని తెలిపారు. అంతేగాక, కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు ధోనీ సిద్ధంగా ఉండాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రవి శాస్త్రి.. బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి చేపట్టే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.
అన్ని ఫార్మాట్లకు కోహ్లీ సారథ్యం వహించగలడా? అని ఇండియా టూడే ఛానెల్ రవి శాస్త్రిని ప్రశ్నించగా.. 'అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు సారథిగా కోహ్లీ సమర్థవంతంగా వ్యవహరించగలడు. ఒకవేళ తాను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయితే ఖచ్ఛితంగా ఆ పని చేస్తాను. దీనిపై ఆలోచించాల్సిన సమయం వచ్చింది. 2019 ప్రపంచ కప్ కాకుండా టీమిండియా ఆడాల్సిన పెద్ద టోర్నీలో ఈ మధ్య కాలంలో లేవు. కాబట్టి ఈ సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలి' అని తెలిపారు.
కోహ్లీ నాయకత్వంతో ధోనీ ఓ ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని కూడా రవి శాస్త్రి ఇచ్చారు. 'ధోనీ టీమిండియాకు ఎంతో విలువైన ఆటగాడు. సమయం వచ్చినప్పుడు అతడ్ని ఆటగాడిగా ఆడేందుకు అవకాశం ఇవ్వాలి. కెప్టెన్సీని నుంచి తప్పుకుంటే అతను మరింత బాగా రాణించగలడు. అందుకోసమే కఠిన నిర్ణయాలు తప్పవు'అని రవి శాస్త్రి తెలిపారు.
కోహ్లీ ప్రస్తుతం జట్టును సమర్థవంతంగా నడిపించగల నాయకుడిగా ఎదుగుతున్నాడని, ఇది అందరూ గుర్తించాలని శాస్త్రి చెప్పారు. అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20లకు అతడు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఆస్ట్రేలియా జట్టు పాలసీని అనుసరించవచ్చని అన్నారు. మార్క్ టేలర్ గొప్ప కెప్టెన్ అయినప్పటికీ స్టీవ్ వా నాయకత్వంలో ఆడాడని, వా ఉండగానే రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ వచ్చారని, ఇప్పుడు స్టీవ్ స్మిత్ సారథిగా వచ్చాడని చెప్పారు.