హైదరాబాద్: విరాట్ కోహ్లీలో ప్రస్తుతం ఉన్న కెప్టెన్సీ దూకుడుని ఒకప్పుడు తాను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్లో చూశానని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ వెల్లడించాడు. శ్రీలంకపై మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీసేన క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో హస్సీ మీడియాతో మాట్లాడాడు.
కోహ్లీలోని బలమైన గెలుపు కాంక్ష తనని అమితంగా ఆకట్టుకుంటోందని హస్సీ వెల్లడించాడు. ఒకప్పుడు రికీ పాంటింగ్లో ఈ కాంక్ష ఉండేదని, ఇప్పుడు కోహ్లీలో అంతకంటే ఎక్కువే ఉందని హస్సీ అభిప్రాయపడ్డాడు.
'కోహ్లీ చాలా తెలివైన ఆటగాడు. అతని కెప్టెన్సీ నాకు బాగా నచ్చుతోంది. దూకుడుగా ఆడుతూ.. గెలవాలనే అతని కాంక్ష నాకు ఇంకా ఇష్టం. బలీయమైన అతని కోరికే.. జట్టును విజయాల బాట పట్టిస్తోంది. ఫిటెనెస్ పరంగా.. మ్యాచ్ల్లోనూ అతను ఒక అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇదే తరహా లక్షణాలు నేను ఒకప్పుడు రికీ పాంటింగ్లో చూశాను' అని హస్సీ అన్నాడు.
ఇద్దరూ ప్రత్యర్థి జట్టులపై ఆధిపత్యం చెలాయించాలనే ధోరణితో ఉంటారని అన్నాడు. ఇక, త్వరలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్కి వస్తుండటంతో ఈ సిరీస్ చాలా రసవత్తరంగా సాగుతుందని హస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
శ్రీలంక సిరిస్ అనంతరం కోహ్లీసేన కాన్ఫిడెన్స్ పెరిగిందని, పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ జట్లలో కోహ్లీ సేన ఒకటని హస్సీ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాపై కోహ్లీసేన 2-1తో టెస్టు సిరిస్ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.