న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే వైదొలిగిన అనంతరం జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి నోరు విప్పాడు. కుంబ్లేకు, తనకు మధ్య జరిగినదాని గురించి మాట్లాడాడు.
చదవండి: అహం వల్లే ఓడిపోయాం: పైనల్లో కుంబ్లే బ్యాటింగ్ తీసుకోమంటే కోహ్లీ ఫీల్డింగ్
శుక్రవారం నుంచి వెస్టిండీస్ సిరీస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కోహ్లీ విలేకరులతో మాట్లాడాడు. కోహ్లీతో విభేదాలు, అతని మంకుపట్టు వల్లే కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, కోహ్లీ మాత్రం 'కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని అనిల్ భాయ్ నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు' అంటూ వ్యాఖానించారు.
కుంబ్లే తప్పుకోవడానికి కారణం ఏమిటి? అసలు చాంపియన్ ట్రోఫీ సందర్భంగా డ్రెసింగ్ రూమ్లో ఏ జరిగింది? ఈ ప్రశ్నలకు మాత్రం కోహ్లీ నేరుగా సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో ఎన్నో ఊహాగానాలు చెలరేగుతున్నాయని, డ్రెసింగ్ రూమ్కు ఏమాత్రం సంబంధం లేనివాళ్లు ఈ ఊహాగానాలను వ్యాప్తి చేస్తున్నారని అన్నాడు.
డ్రెసింగ్ రూమ్లో ఏం జరిగిందన్నది పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, అది జట్టు వ్యక్తిగత విషయమని, దాని గురించి బయటకు చెప్పలేనని కోహ్లీ పేర్కొన్నాడు. డ్రెసింగ్ రూమ్ గౌరవాన్ని, పవిత్రతను తాను కాపాడానని, తానెప్పుడూ గౌరవప్రదంగానే వ్యవహరించినట్టు కోహ్లీ చెప్పుకొచ్చాడు.