హైదరాబాద్: విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ల మధ్య త్వరలో జరగబోయే సిరిస్ ఎంతో ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా భారత్లో పర్యటించనుంది.
ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో మైక్ హస్సీ ది హిందూకి ఇచ్చిన ఇంటర్యూలో 'కోహ్లీ-స్మిత్ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. మైదానంలో ఇద్దూర దూకుడుగానే వ్యవహారిస్తారు. దీంతో ఈ సిరిస్ ఇద్దరి ఆటగాళ్ల మధ్య యుద్ధంలా సాగుతుందే తప్ప రెండు జట్ల మధ్య కాదు. కోహ్లీ, స్మిత్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఇద్దరు కెప్టెన్లు తమ జట్ల విజయం కోసం శ్రమిస్తారు' అని అన్నాడు.
ఈ ఏడాది ఆరంభంలో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్ కోసం ఆస్ట్రేలియా భారత్లో పర్యటించింది. ఈ టెస్టు సిరిస్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండు సెంచరీలు చేయగా, కోహ్లీ ఏమంత గొప్ప ప్రదర్శన చేయలేదు. ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు.
దీంతో కోహ్లీ స్ధానంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలు అందిపుచ్చుకున్నాడు. ధర్మశాల టెస్టులో టీమిండియా నెగ్గడంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-1తో కోహ్లీసేన కైవసం చేసుకుంది. ఈ టెస్టు సిరిస్పై కూడా హస్సీ మాట్లాడాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ అభిమానులకు ఎంతో మజానిచ్చిందని, త్వరలో జరిగే వన్డే, టీ20 సిరీస్లు అంతకన్నా ఎక్కువ మజానిస్తాయని అన్నాడు.
ఈ పరిమిత ఓవర్ల సిరిస్లో జట్టులో ఆటగాళ్ల ప్రదర్శన కన్నా స్మిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి నెలకొని ఉంటుందని హస్సీ తెలిపాడు. ఈ మధ్య కాలంలో ఇద్దరు కెప్టెన్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారని, ఇద్దరూ కెప్టెన్సీ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారని కొనియాడాడు. దీంతో వీరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుండటంలో ఎలాంటి అనుమానం లేదని హస్సీ చెప్పుకొచ్చాడు.