హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్పై ఏడు వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కోల్కతా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఒకే ఓవర్లో స్టంప్ అవుట్ ద్వారా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా నిలిచాడు. 2009లో జరిగిన ఐపీఎల్లో అమిత్ మిశ్రా రాజస్థాన్ రాయల్స్పై తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కుల్దీప్ ఆ ఘనతను సాధించడం విశేషం.
బుధవారం జరిగిన మ్యాచ్లో 15వ ఓవర్లో వరుసగా 4,6 బాదిన ధోని మరుసటి ఓవర్లో మరో భారీ సిక్స్తో చెలరేగాడు. ఆ తర్వాత 18వ ఓవర్ కుల్దీప్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని షాట్ ఆడేందుకు ధోనీ ముందుకు రాగా కీపర్ రాబిన్ ఉతప్ప స్టంపౌట్ చేశాడు.
దీంతో 148 పరుగుల వద్ద ధోనీ (16 బంతుల్లో 23) పరుగులతో మూడో వికెట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో ఐదో బంతికి మనోజ్ తివారీ(1) ముందుకొచ్చి ఆడాలని చూడగా బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే ఉతప్ప వికెట్లను గిరాటేయడం తివారీ పెవిలియన్కు చేరాడు.
దీంతో పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో స్టంప్ అవుట్ ద్వారా రెండు వికెట్లు తీసిన బౌలర్గా కుల్దీప్ రికార్డు సృష్టించాడు. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి ఈ ఘనత సాధించడంపై బౌలర్ కుల్దీప్ సంతోషం వ్యక్తం చేశాడు.