హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య చోటు చేసుకున్న విభేదాలపై కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ తొలిసారి స్పందించారు. జస్టిస్ ఆర్ఎం లోధా సంస్కరణల అమలుపై ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది.
ఈ సమావేశం అనంతరం వినోద్ రాయ్ మీడియాతో మాట్లాడారు. కెప్టెన్ కోహ్లీతో పోలిస్తే కుంబ్లే చాలా పరిణతి కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు. కోచ్గా అతని రికార్డు అద్భుతమని కొనియాడారు. ఇద్దరు వ్యక్తులు 24 గంటలూ కలిసే ఉంటే సాధారణంగానే వృత్తిపరమైన భేదాభిప్రాయాలు వస్తాయని అన్నారు.
ప్రధాన కోచ్గా కుంబ్లే కాంట్రాక్ట్ ఏడాదికేనని, వాళ్లిద్దరి మధ్య వృత్తిపరమైన, అవగాహనపరమైన విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 'కుంబ్లే చాలా పరిణతి గల వ్యక్తి. ఇక చాలు అనుకొని అతను తప్పుకున్నాడు. మైదానంలో కెప్టెనే కదా ఆడేది. కుంబ్లే తన పాత్రను అద్భుతంగా పోషించాడు. ఈ విషయంలో మేం కూడా ప్రొఫెషనల్గానే ఉండాలి' అని రాయ్ అన్నారు.
కుంబ్లే రాజీనామా అనంతరం ప్రధాన కోచ్ పదవికి మరిన్ని దరఖాస్తులు ఆహ్వానించడాన్ని కూడా ఆయన సమర్థించారు. టీమిండియాను 2019 వరల్డ్ కప్ వరకు నడిపించగలిగే అత్యుత్తమ కోచ్ను ఎంపిక చేయాలంటే ఈ నిర్ణయం సరైందేనని అన్నారు. బీసీసీఐ పాలనలో తాము ఇచ్చిన సూచనలను చాలా వరకు పాటిస్తున్నారని అన్నారు.