హైదరాబాద్: క్రీడా మంత్రిని కోతి అని సంభోదించి శ్రీలంక పేసర్ లసిత్ మలింగ చిక్కుల్లో పడ్డాడు. ఈ విషయంలో మలింగపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ చేరడంలో విఫలమైన శ్రీలంక జట్టుపై ఆ దేశ క్రీడామంత్రి దయసిరి జయశేఖర తీవ్ర విమర్శలు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
శ్రీలంక ఆటగాళ్లకు సరైన ఫిట్నెస్ లేదని, పొట్టలు పెంచుకొని చాలా లావుగా తయారయ్యారని ఆ కారణంగానే మైదానంలో చాలా క్యాచ్లను నేలపాలు చేశారని ఆరోపించారు. ఇలా ఉంటే క్రికెట్ ఎలా ఆడతారని ఆయన అన్నారు. కాగా, పాకిస్థాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మూడు క్యాచ్లను నేలపాలు చేసింది.
ఈ మూడింటిని మలింగనే వదిలేయడం విశేషం. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు మలింగా వింతగా సమాధానం ఇచ్చాడు. 'ఏసీ రూముల్లో కూర్చొని చేసే ఈ విమర్శలను నేను పట్టించుకోను. చిలుక గూటి గురించి కోతులకు ఏం తెలుసు? ఇది చిలుక గూటిలోకి కోతులు వచ్చి దాని గురించి మాట్లాడినట్లు ఉంది' అని మలింగ విమర్శించాడు.
మలింగ వ్యాఖ్యలను జయశేఖర సీరియస్గా తీసుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డుతో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించేలా మలింగ వ్యాఖ్యలు ఉన్నాయని, అందుకే విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు తాను మలింగ ఒక్కన్నే తిట్టలేదని, ప్లేయర్సందరినీ కలిపి విమర్శిస్తే.. అతనికెందుకంత ఉలుకు అని అన్నారు.
పాక్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ క్యాచ్ను రెండుసార్లు డ్రాప్ చేసి శ్రీలంక భారీ మూల్యమే చెల్లించింది. నిజానికి క్రికెట్ ఆడాలంటే ప్లేయర్స్లో కొవ్వు శాతం 16కు మించరాదని, కానీ లంక ప్లేయర్స్లో కొందరి కొవ్వు శాతం 25 వరకు ఉందని మంత్రి చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహక శిబిరానికి హాజరు కాకుండా మలింగ ఐపీఎల్లో ఆడటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.