హైదరాబాద్: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి జట్లను హడలెత్తించిన మలింగా తన కెరీర్లో 200వ వన్డే ఆడుతున్నాడు. భారత్తో ఐదు వన్డేల సిరిస్లో భాగంగా దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డే మలింగాకు 200వ వన్డే కావడం విశేషం.
తద్వారా శ్రీలంక తరపున 200వ వన్డే ఆడుతున్న 13వ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. శ్రీలంక తరుపున బౌలర్లలో మురళీధరన్, చమిందా వాస్ల తర్వాత ఆ ఘనత సాధించిన మూడో బౌలర్గా మలింగా అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు మలింగా మరో రికార్డుకి చేరువలో ఉన్నాడు.
ప్రస్తుతం వన్డేల్లో 298 వికెట్లు తీసిన మలింగా శ్రీలంక తరపున మూడొందల వన్డే వికెట్లను సాధించడానికి ఇంకా రెండు వికెట్ల దూరంలో నిలిచాడు. అంతకుముందు లంక తరుపున మురళీధరన్(534 వికెట్లు), చమిందా వాస్(400)లు మాత్రమే మూడొందలకు పైగా వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.
ఫిట్ నెస్ కారణంగా ఇటీవలే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన మలింగా ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే మలింగా కొనసాగుతున్నాడు.