హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటైంది. లంక ఓపెనర్ డిక్వెలా (64) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అనంతరం శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ (4) విఫలమైనా ధావన్, కోహ్లీ రెండో వికెట్కు అజేయంగా 197 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోనీ తన కీపింగ్ సత్తా ఏంటో మరోసారి చూపించాడు.
శ్రీలంక ఇన్నింగ్స్లో 42వ ఓవర్ను స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వేశాడు. మూడో బంతిని ఆడేందుకు క్రీజులోకి వచ్చిన మలింగ సిక్స్ బాదేందుకు ముందుకొచ్చాడు. అయితే మలింగ మూమెంట్ గమనించిన చాహల్ తెలివిగా బంతిని ఆఫ్స్టంప్ వైపుకి దూరంగా విసిరాడు.
ఈ క్రమంలో మలింగ ముందుకు రాగానే బంతిని అందుకున్న ధోనీ వికెట్లను గిరాటేశాడు. దీంతో వైడ్ బాల్కు వికెట్ పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
@msdhoni moment 😙😙😙❤ pic.twitter.com/24iEZB9ekb
— NICK DHONI⭕ (@Nick_Dhoni) 21 August 2017