హైదరాబాద్: క్రికెట్ ప్రక్షాళనకు ఏర్పాటైన జస్టిస్ ఆర్ఎమ్ లోధా కమిటీ సూచించిన పలు సంస్కరణలు ఒక్కొ రాష్ట్ర సంఘం వరుసగా అమలు చేస్తున్నాయి. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సోమవారం పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏసీఏ కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తన పదవి నుంచి తప్పుకున్నారు. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి రావడంతో బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు, నర్సాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏసీఏ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు.
విజయవాడలో జరిగిన ఏసీఏ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా బీసీసీఐలో ఆయన పలు కీలక పదవులను చేపట్టారు. ఆయన స్థానంలో గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజు ఏసీఏ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఏసీఏ అధ్యక్షుడిగా ఉన్న డీవీఎస్ఎస్ సోమయాజులు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఏసీఏ కోశాధికారిగా ఉన్న రహీమ్ కూడా తన పదవికి రాజీనామా చేయడంతో ఆయనకు బదులుగా రామచంద్రరావు ఆ బాధ్యతలు తీసుకున్నారు.