ముంబై: అనుకున్నట్టే ఐపీఎల్ ప్రసార హక్కుల టెండర్ల ప్రక్రియను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం టెండర్లను తెరవాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం టెండర్లను తెరవాల్సి ఉంది.
అయితే ఐపీఎల్ టెండర్ల ప్రక్రియపై తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తామంటూ బోర్డు నుంచి లేఖ కావాలంటూ సోమవారం లోధా కమిటీ సెక్రటరీ గోపాల శంకర్నారాయణ్ బోర్డుకు ఈమెయిల్లో వెల్లడించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో టెండర్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
కాగా బోర్డుకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించేందుకు లోధా ప్యానెల్ నియమించే ఆడిటర్ పర్యవేక్షణలోనే జరగాలని గతవారంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల ప్రక్రియ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిగా బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే కమిటీకి లేఖ రాశారు.
ఆర్థిక లావాదేవీలకు బ్రేక్: ఐపీఎల్పై స్పష్టత కోరిన బీసీసీఐ
ఈ లేఖకు బదులుగా లోధా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్నారాయణ్ పై విధంగా ఈమెయిల్ రూపంలో బదులిచ్చారు. 'మార్గదర్శకాలు ఇచ్చే ముందు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీసీఐ నడుచుకోవడానికి సుముఖమేనా? అనేది తెలియాలి. అందుకు బోర్డు తరఫున అధ్యక్షుడు అంగీకారం తెలుపుతూ లేఖ రాయాలి' అని మొదటగా కమిటీ ప్రస్తావించింది.
ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల విషయమై కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. 'మీరు రాసిన లేఖలో 2016, మేతో ఐపీఎల్ ప్రసార హక్కుల కాంట్రాక్ట్ ముగియడంతో తాజాగా టెండర్లను పిలిచినట్టు పేర్కొన్నారు. అయితే గత పదేళ్ల కాంట్రాక్ట్ ఎప్పుడు ముగిసింది? తర్వాతి పదేళ్ల కాంట్రాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?' స్పష్టత నివ్వాలని కమిటీ కోరింది.
దీంతో పాటు 2018 నుంచి అమల్లోకి వచ్చే టెండర్ల ప్రక్రియను చాలా తొందరగా ముగించాలనేది బీసీసీఐ ఆలోచనలా కనిపిస్తోందని కమిటీ అందులో పేర్కొంది. కాగా, లోధా కమిటీ ఈ మెయిల్కు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. వచ్చే నెల 5న సంస్కరణల అమలుకు సంబంధించిన నివేదికను సమర్పిస్తామని తెలిపారు.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 'ప్రస్తుత పదేళ్ల కాలపరిమితి 2017తో పూర్తవుతుంది. 2018 సీజన్ నుంచి ఐపీఎల్ కోసం టెండర్లను ఆహ్వానించాం' అని ఠాకూర్ వివరించారు. మరోవైపు టెండర్ల ప్రక్రియ వాయిదా పడటంపై బిడ్లు దాఖలు చేసిన కంపెనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ తాజా పరిస్థితికి బీసీసీఐ క్షమాపణలు తెలిపింది.
'పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెండర్ ప్రక్రియ కొనసాగాలని మేం లోధా కమిటీకి సమాచారమిచ్చాం. విదేశాల నుంచి బిడ్డర్లు భారత్కు వస్తారని కూడా తెలిపాం. అయితే ఆడిటర్ నియామకం గురించి కమిటీ నుంచి మాకు స్పష్టమైన సమాచారం రాలేదు. దీంతో టెండర్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రొఫెషనల్గా నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. అందుకే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాం' అని బీసీసీఐ వెల్లడించింది.
ఎవరికి లాభం?: ఐపీఎల్పై కన్నేసిన ఫేస్బుక్, ట్విట్టర్
కాగా అక్టోబర్ 25న ముగిసే టెండర్ల ప్రక్రియలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్ సహా 18 సంస్థలు హక్కుల కోసం పోటీపడుతున్నాయి.