హైదరాబాద్: బీసీసీఐలో పారదర్శకత కోసం జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు మిగతా క్రీడల్లో కూడా అవసరమని బీజేపీ బహిష్కృత ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాగ్పూర్లోని ఓ హోటల్లో జరిగిన బ్యాంకర్స్ స్పోర్ట్స్ క్లబ్ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
క్రికెట్లో పారదర్శకత కోసం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు ఎంత అవరసరమో, అదే విధంగా మిగతా క్రీడల్లో కూడా అలాంటి సూచనలే అవసరమని ఆజాద్ పేర్కొన్నారు. భారత్లో కొన్ని క్రీడా బోర్డులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ నిబంధనలను పాటించడం లేదని ఆయన పేర్కొన్నారు.
లోధా కమిటీ సూచనలపై బీసీసీఐ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయాల్సి వస్తుందో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. లోధా ప్రతిపాదనలను వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. క్రికెట్ అనేది ఆటగాళ్ల వల్లే పొందిందనే విషయాన్ని అధికారులు గుర్తించుకుంటే మంచిదని అన్నారు.
పాలనా అధికారుల వల్ల ఆ క్రీడ బ్రతుకుందని తాను అనుకోవడం లేదన్నారు. కొంత మంది ఆ పదవుల్ని పట్టుకుని ఎందుకు వెళాడుతున్నారని మండిపడ్డారు. 'క్రీడలపై నమ్మకం ఉండాలి. అది క్రికెట్ అయినా, వేరే గేమ్ అయినా పారదర్శకత అవసరం. లోధా ప్యానల్ మాదిరి మిగతా క్రీడలకు కూడా ఏర్పాటు చేసి ప్రక్షాళనకు నడుం బిగించాలి' అని ఆజాద్ అన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్, అవతవకలు చోటు చేసుకోవడంతో సుప్రీం కోర్టు జస్టిస్ ఆర్ ఎమ్ లోధా నేతృత్వంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో చోటు చేసుకున్న అవకతవకలకు మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఒక్కడే బాధ్యుడు కానీ, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కూడా బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు.
ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించడమే దీనికి అంతటికి కారణమని అన్నారు. లోధా కమిటీ సూచించిన ఒక రాష్ట్రానికి ఒకే ఓటుపై కూడా బీసీసీఐ ఆలోచించాల్సి ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీహార్కు ఇప్పటి వరకు ఓటు లేకపోవడంపై బీసీసీఐ స్పందించాల్సి ఉందన్నారు.