హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఆదివారం అతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.
అనంతరం 229 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన భారత్ 5 పరుగుల వద్ద ఓపెనర్ స్మృతి మంధాన వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ అనవసర పరుగు కోసం యత్నించి జట్టు స్కోరు 43 వద్ద రనౌట్గా పెవిలియన్కు చేరింది.
ఇంగ్లాండ్ బౌలర్ మార్ష్ వేసిన 13 ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న పూనమ్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇద్దరు పరుగు తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో బంతి అందుకున్న షివర్ వికెట్ కీపర్ టేలర్కు బంతి అందించడంతో ఆమె వికెట్లను గిరాటేసింది.
మిథాలీ రాజ్ ఇంకా క్రీజులోకి చేరుకోకపోవడంతో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన మిథాలీ రాజ్ ఫైనల్లో కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని గెలిపిస్తుందని అభిమానులు భావించారు.
కానీ, ఫైనల్లో అలా జరగలేదు. అయితే తాజాగా మిథాలీ తన రనౌట్ అవ్వడానికి గల కారణాన్ని వెల్లడించింది. పరుగు కోసం యత్నిస్తున్న క్రమంలో షూస్ మైదానంలో కూరుకుపోవం వలనే తాను వేగంగా రన్ చేయలేకపోయానని మిథాలీ వెల్లడించింది.
ఉమెన్ వరల్డ్ కప్: విజేతగా ఇంగ్లాండ్, పోరాడి ఓడిన మిథాలీ సేన
'బంతిని ఎదుర్కొన్న వెంటనే పూనమ్ పరుగు కోసం పిలిచింది. కానీ నా బూట్లు సహకరించలేదు. అవి మైదానంలో కూరుకుపోయాయి. అందుకే వేగంగా కదలలేకపోయా. ఫలితంగా రనౌట్ అయ్యా. తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాను' అని మిథాలీ తెలిపింది.