హైదరాబాద్: తాను ఇకపై క్రికెట్ ఆడేందుకు పనికిరానని డాక్టర్లు చెప్పడంతో తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. గతేడాది జూన్ నెలలో వెస్టిండిస్లో జరిగిన ముక్కోణపు సిరిస్ ఆడిన మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడి దాదాపు ఎనిమిది నెలలు అయ్యింది.
అప్పటి పర్యటనలో వెన్నునొప్పి కారణంగా మోర్కెల్ దక్షిణాఫ్రికా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం మొమెంటమ్ వన్డే కప్ టోర్నీలో ఆడుతున్న మోర్కెల్ తాను పూర్తిస్థాయిలో ఫిట్నెస్ నిరూపించుకుని తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానని మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
'గతంలో నన్ను క్రికెట్ వదిలేయమని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను వెన్నునొప్పితో బాధపడుతున్న తరుణంలో క్రికెట్ నుంచి దూరంగా ఉండమని ఒక డాక్టర్ చెప్పాడు. ఇక నేను క్రికెట్ ఆడేందుకు పనికిరానని తేల్చి చెప్పాడు. ఆ క్షణంలోనే నా క్రికెట్ కెరీర్పైనే అనుమానం వచ్చింది' అని మోర్కెల్ పేర్కొన్నాడు.
దాంతో 'ఇక నేను క్రికెట్ ఆడగలనా? అనే సందేహం నన్ను ఆందోళనలో పడేసింది. ఆనాటి నుంచి నా ఫిట్నెస్ నిరూపించకోవడం కోసం శ్రమిస్తూనే ఉన్నా. ఆ డాక్టర్ ఇచ్చిన సలహా పక్కను పెట్టేశా. నాకు నేనుగా వెన్నునొప్పి నుంచి బయట పడేందుకు కష్టపడుతూనే ఉన్నా' అని చెప్పాడు.
అదే సమయంలో వెన్ను నొప్పి నుంచి బయటపడేందుకు గాను ఇతర డాక్టర్ల సలహాలను కూడా తీసుకుంటాన్నానని మోర్కెల్ పేర్కొన్నాడు. ఇప్పుడిప్పుడే వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్నానని, త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టులో చోటు కూడా దక్కించుకుంటానని మోర్కెల్ తెలిపాడు.
దక్షిణాఫ్రికా జట్టు తరుపున పలు అంతర్జాతీయ మ్యాచ్లాడిన మోర్నీ మోర్కెల్ టెస్టుల్లో 242 వికెట్లు తీసుకోగా, వన్డేల్లో 181 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 10వ ఎడిషన్కు అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు.