హైదరాబాద్: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని గుజరాత్ రాజధాని మొతేరాలో లార్సెన్ అండ్ టూబ్రో నిర్మిస్తోంది. సుమారు ఒక లక్షా పదివేల మంది కూర్చుకునే విధంగా మొతేరాలో ఈ స్టేడియం నిర్మాణం జరుగుతుండటం విశేషం. ప్రధాని నరేంద్రమోడీ, గుజరాత్కు అందిస్తున్న కలల ప్రాజెక్టుగా ఈ స్టేడియాన్ని లార్సెన్ అండ్ టూబ్రో నిర్మిస్తోంది.
మొతేరాలోని పాత క్రికెట్ మైదానాన్ని మరింత విస్తృత పరచాలన్నది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అభిమతం. ఇందులో భాగంగా ఈ స్టేడియం నిర్మాణం నిమిత్తం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమళ్ నత్వానీ ఎల్ అండ్ టీ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 54,000గా ఉంది. దీని స్ధానంలో కొత్త స్టేడియాన్ని నిర్మించనున్నారు.
కాగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న క్రికెట్ మైదానంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ 1,00,204గా ఉంది. ఇక మొతేరాలో సర్ధార్ పటేల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఆ రికార్డును బద్దలు కొడుతుంది. మొతేరాలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియం 1,10,000 మంది కూర్చునే విధంగా నిర్మిస్తున్నారు.
అంతేకాదు స్టేడియం సిద్ధమైన తర్వాత, అంత భారీ సంఖ్యలో క్రీడాభిమానులు మైదానం లోనికి వెళ్లి, సులువుగా, వేగంగా బయటకు వచ్చేందుకు అవసరమైనన్ని ద్వారాలను ఏర్పాటు చేయనున్నట్టు జీసీఏ కార్యదర్శి రాజేష్ పటేల్ వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ సామర్థ్యం కలిగి ఉన్న టాప్ స్టేడియాల్లో భారత్కు చెందిన ఐదు స్టేడియాలు కూడా చోటు దక్కించుకున్నాయి.
కోల్కత్తాలోని ఈడెన గార్డెన్స్ (66,000), షాహిద్ వీర్ నారాయన్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెటె స్టేడియం, నయా రాయ్ పూర్ (65,000), జవహార్ లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియం, కొచ్చి (60,000), రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (60,000) సీట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.