హైదరాబాద్: కటక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కోహ్లీ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
లోకేష్ రాహుల్(5), ధావన్(11), కోహ్లీ(8) తొందరగానే ఔటైనప్పటికీ యువీ, ధోనీలు నిలకడగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని 14వ ఓవర్లో బంతిని బౌండరీకి తరలించడంతో ధోని వ్యక్తిగత స్కోరు 10 పరుగులకు చేరింది.
దీంతో స్వదేశంలో నాలుగువేల పరుగుల మైలురాయిని ధోని అందుకున్నాడు. తద్వారా భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. 110 వన్డేలతో ధోని ఈ ఘనతను సాధించాడు. ఇదిలా ఉంటే స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 6,976పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
సచిన్ తర్వాత నాలుగు వేల పరుగులు చేసిన ధోని రెండో స్ధానంలో ఉండగా, టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ 3,406పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సెంచరీ సాధించాడు. 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు.
కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ చేసిన తొలి సెంచరీ ఇదే. తన వన్డే కెరీర్లో 10వ సెంచరీ నమోదు చేశాడు.
That is 4000 ODI runs for @msdhoni in India, only the second batsman after @sachin_rt to get to that milestone #INDvENG @Paytm #TeamIndia pic.twitter.com/BjYlSvriUU
— BCCI (@BCCI) 19 January 2017