హైదరాబాద్: ఐపీఎల్లో పూణె ప్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనిని తప్పించిన తర్వాత క్రికెట్ అభిమానులకు కాస్తంత ఊరట కలిగించే వార్త. ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైన రెండు రోజులకే మహేంద్ర సింగ్ ధోని త్వరలో కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.
ఫిబ్రవరి 25 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ధోని జార్ఖండ్ కెప్టెన్గా బరిలోకి దిగనున్నాడు. గత రెండు సీజన్లలోనూ జార్ఖండ్ తరపున ఆడినా కెప్టెన్సీ మాత్రం వహించలేదు. ధోని సారథ్యంలోని 18 మంది సభ్యుల జట్టును మంగళవారం ప్రకటించారు.
గత నెలలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే. ధోని కెప్టెన్సీతో జార్ఖండ్ జట్టు మరింత బలంగా తయారవుతుందని భావిస్తున్నారు. ధోనితో పాటు జార్ఖండ్ జట్టులో ఇషాన్ కిషన్, షబాజ్ నదీం సైతం జట్టులో ఉన్నారు. గతేడాది కూడా ఈ టోర్నీ ఆడిన ధోని.. వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడాడు.
రెండు రోజుల క్రితం ఐపీఎల్లో పూణె ప్రాంఛైజీ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ జట్టు నాయకత్వ బాధ్యతలను స్టీవెన్ స్మిత్కు అప్పగించింది. భారత్కు 331 అంతర్జాతీయ మ్యాచ్లలో, 143 ఐపీఎల్ మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరించిన ధోని జార్ఖండ్కు తొలి సారి కెప్టెన్ కావడం విశేషం.
ఇక రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు మెంటార్గా కూడా వ్యవహరించాడు. గ్రూప్ డీలో జార్ఖండ్తోపాటు చత్తీస్గఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, సౌరాష్ట్ర, సర్వీసెస్ తదితర జట్లు ఉన్నాయి.
జార్ఖండ్ జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), ఇషాన్ కిషన్, ఇషాంక్ జాగి, విరాట్ సింగ్, సౌరభ్ తివారీ, కుషాల్ సింగ్, ప్రత్యూష్ సింగ్, షబాజ్ నదీం, సోనుకుమార్ సింగ్, వరుణ్ అరోన్, రాహుల్ సుక్లా, అనుకుల్ రాయ్, మోను కుమార్ సింగ్, జస్కరన్ సింగ్, ఆనంద్ సింగ్, కుమార్ దియోబ్రాత్, రాథోడ్, వికాస్ సింగ్.