హైదరాబాద్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నాడు. అయితే ధోని ప్రారంభించబోయే అకాడమీ ఇండియాలో కాదు దుబాయ్లో.
దుబాయ్ పసిఫిక్ స్పోర్ట్స్ క్లబ్ (పీఎస్సీ)తో కలిసి దుబాయ్లోనే ఈ క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. ఆ అకాడమీకి 'ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ' అని పేరు పెట్టనున్నట్లు పీఎస్సీ ప్రతినిధి పర్వేజ్ ఖాన్ తెలిపారు.
ధోనీతో కలిసి పనిచేస్తుండటం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తాము ఏర్పాటు చేయనున్న అకాడమీని అప్పుడప్పుడు ధోని సందర్శిస్తారని, అలాగే ఈ అకాడమీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉంటాడని చెప్పారు.
తమ క్లబ్లో తొలిసారి ఓ క్రికెటర్ అకాడమీ ప్రారంభిస్తున్నామని, అది కూడా దుబాయ్లో అని ఆయన చెప్పారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాలని తాము అనుకున్నట్లు, అందుకు ధోనీ కూడా సుముఖత వ్యక్తం చేశారని అన్నారు.
ఈ అకాడమీ కోసం ధోని సెప్టెంబర్లో దుబాయ్కి వెళ్లే అవకాశం ఉంది. ఈ అకాడమీ ద్వారా యూఏఈలో క్రికెట్ ప్రమోషన్ కోసం స్కూళ్లు, కాలేజీలతో చేతులు కలుపనుంది. యూఏఈతో పాటు ఇతర జీసీసీ దేశాలు, దక్షిణాఫ్రికా, యూకేల్లో కూడా ఎమ్మెస్ ధోనీ క్రికెట్ అకాడమీలపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని పసిఫిక్ స్పోర్ట్స్ క్లబ్ ప్రకటించింది.
ఇక, పీఎస్సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు ఆనందంగా ఉందని, అకాడమీ కోసం తన వీలైనంత కృషి చేస్తానని మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు.