న్యూఢిల్లీ: భారత వన్డే, ట్వంటీ 20 జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం నాడు హఠాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు ఫార్మాట్లకూ అతను గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఆయన టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పారు.
తాజాగా, వన్డే, ట్వంటీ 20 క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు. దీంతో అన్ని ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పినట్లయింది. వన్డే, ట్వంటీ 20 క్రికెట్ కెప్టెన్సీ బాధ్యత కోహ్లీకి అప్పగించనున్నారు. అయితే, ఓ ఆటగాడిగా ఇంగ్లాండ్ సిరీస్కు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండనున్నారు.
ధోనీ బీసీసీఐకి సమాచారం ఇచ్చారు. అతని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ధోనీ 199 వన్డేలు, 72 ట్వంటీ 20లకు కెప్టెన్గా వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ వన్డేల్లో 110 విజయాలు సాధించింది. పాంటింగ్ తర్వాత అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోనీ.
NEWS ALERT - Mahendra Singh #Dhoni steps down as #Captain of #TeamIndia. He will be available for selection for ODIs & T20Is vs England pic.twitter.com/2xM0eisdjq
— BCCI (@BCCI) 4 January 2017
ధోనీ సడన్ నిర్ణయంతో కోహ్లీకి కెప్టెన్సీ
మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండుతో సిరీస్ ఉంది. ఇలాంటి సమయంలో ధోనీ సడన్ షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్కు కోహ్లీని కెప్టెన్గా ఉండనున్నారు. సాధారణంగా కెప్టెన్ తన నిర్ణయాన్ని ముందుగా ప్రకటిస్తే తదుపరి కెప్టెన్కు కొంచెం సమయం చిక్కుతుంది. ధోనీ మాత్రం హఠాత్తుగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన ఇలా చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా అనే చర్చ సాగుతోంది.
ధోని సాధించిన విజయాలు:
* 2007 సెప్టెంబరులో టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా ధోని ఎంపికయ్యాడు
* 2007 సెస్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో వన్డే కెప్టెన్గా ధోని బాధ్యతలు
* ధోని 72 టీ20 మ్యాచ్లకు, 199 వన్డేలకు కెప్టెన్గా బాధ్యతలు వహించాడు.
* ధోని నేతృత్వంలోని టీమిండియా 2009 డిసెంబరులో టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్గా అవతరించింది.
* ధోని కెప్టెన్సీలో భారత్ జట్టు 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సాధించింది.
* 2013 మార్చిలో విజయవంతమైన టెస్టు కెప్టెన్గా భారత్ తరఫున ధోనీ రికార్డు నమోదు చేశాడు.
* 49 టెస్టుల్లో 21 విజయాలు సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డును ధోని అధిగమించాడు.
* ధోనీ సారథ్యంలోని టీమిండియా 2007లో టీ20, 2011లో వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.