న్యూఢిల్లీ: హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన మొబైల్ ఫోన్లు పోయాయి. దీంతో అతను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో జార్ఖండ్ క్రికెటర్కు చెందిన మూడు ఫోన్లు పోయాయి.
దీనిపై ఆయన ద్వారకా సెక్టార్ 10 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియాలో వస్తున్న వివరాల మేరకు.. హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ధోనీ, ఇతర జార్ఖండ్ ఆటగాళ్లు బయటపడే ప్రయత్నం చేశారు. అప్పుడు అతని ఫోన్లు ఎవరో దొంగిలించారు.
ధోనీతో పాటు మిగిలిన వారందరూ హోటల్ నుంచి బయటికి వచ్చేశారు. కొద్దిసేపటి తర్వాత గదిలోకి వెళ్లిచూస్తే అక్కడ పెట్టిన మూడు ఫోన్లు కన్పించకుండా పోయాయి. వాటిలో టీమిండియాకు, బీసీసీఐకి సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు ధోనీ పోలీసులకు తెలిపారు.
హోటల్లో అగ్ని ప్రమాదం: సురక్షితంగా బయటపడ్డ ధోని, బూడిదైన కిట్
ధోనీ, ఇతర జార్ఖండ్ ప్లేయర్లకు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఢిల్లీలో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ధోనీ, జట్టు ఆటగాళ్లు నగరంలోని ఓ హోటల్లో బసకు దిగారు.
ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆటగాళ్లు అక్కడ్నుంచి పరుగులు తీశారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
జార్ఖండ్ కెప్టెన్గా హజారే ట్రోఫిలో పాల్గొంటున్న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ధోనీ ఢిల్లీ వెళ్లారు. ఉన్నట్టుండి అగ్నిప్రమాదం జరిగింది.. పైగా కిట్ మొత్తం బూడిద పాలయింది.
ఇదిలా ఉండగా, విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఝార్ఖండ్ జైత్రయాత్ర ముగిసింది. ధోని సారథ్యంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సెమీస్ చేరిన ఆ జట్టు.. శనివారం బంగాల్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఝార్ఖండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ధోని.. సెమీస్లోనూ మెరుపులు మెరిపించాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. ఝార్ఖండ్ 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.