ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ఎంఎస్ ఎధోనీ ది అన్టోల్డ్ స్టోరీ' శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో ధోనీ స్పందించాడు. తన జీవితంలోని చాలా ఘటనలు ఈ సినిమాలో అలాగే చిత్రీకరించారని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడం నుంచి ప్రపంచ ఉత్తమ కెప్టెన్లలో ఒకడిగా స్థానం దక్కించుకునే వరకూ చూపించడం జరిగింది.
అంతేగాక, టీమిండియాలోకి రాకముందు ధోనీ పరిస్థితి ఏంటీ?, అతడి ప్రస్థానం ఎలా సాగింది, సామాన్య కుటుంబంలో పుట్టి ధోని గొప్ప క్రికెటర్గా ఎలా ఎదిగాడు? ఇలాంటి అంశాలన్నింటినీ చూపించబోతున్నారు 'ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ'లో. కాగా, ధోనీ స్వయంగా కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ధోనీ. 'ఎం.ఎస్.ధోని' ట్రైలర్ గమనిస్తే.. ధోని పాత్రధారి సుశాంత్ సింగ్ రాజ్పుత్ నేరుగా పరీక్ష హాలు నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు బండి ఎక్కడం గమనించవచ్చు.
ఆ అనుభవం గురించి ధోని గుర్తు చేసుకుంటూ.. 'ఆ సన్నివేశాలు చూస్తుంటే నాకు నవ్వొచ్చింది. నా చివరి పరీక్ష ముగియగానే అట్నుంచి అటే వెళ్లి రైలెక్కాను. నా యూనిఫామ్ విప్పడం కూడా మరిచిపోయా. అయితే నేను పరీక్షలకు భయపడి ఇంటి నుంచి పారిపోతున్నా అనుకుని రైల్లో కొందరు పెద్దవాళ్లు నాకు హితబోధ చేయడం మొదలుపెట్టారు. నేను మ్యాచ్ కోసమే అలా వెళ్తున్నానని చెప్పేలోపే వాళ్లు నన్ను బలవంతంగా రైలు నుంచి దించేయాలని కూడా చూశారు' అని చెప్పాడు.
సినిమాలో తాను ఖరగ్పూర్లో టీటీఈగా ఉన్న రోజుల గురించి వివరంగా చూపించబోతున్నారని చెప్పిన ధోని.. తన జీవితంలో అవి ఎప్పటికీ మరిచిపోలేని రోజులన్నాడు. టీటీఈగా ఉన్నపుడు తన క్రికెట్ సాధన గురించి వివరించాడు ధోనీ.
'క్రికెట్ సాధన చేసుకోవడానికి బాగుంటుందని.. అప్పుడు నేను క్రీడా విభాగంలో చేరాను. అయితే సమయం బాగానే దొరికేది కానీ.. మామూలు బంతితో సాధన చేయడానికి సహచరులు దొరికేవారు కాదు. దీంతో టెన్నిస్ బంతితో ఆడటం అలవాటు చేసుకున్నా. కానీ అక్కడ నా బ్యాటింగ్ నైపుణ్యం మెరుగుపరుచుకున్నదేమీ లేదు. అక్కడ మంచి బౌలర్గా ఎదిగాను' అని ధోనీ చెప్పాడు.
ట్రైలర్లో సుశాంత్ నోటి నుంచి వినిపించిన 'ఆ ముగ్గురూ జట్టులో ఉండటానికి అర్హులు కారు' అన్న డైలాగ్ గురించి ధోని స్పందిస్తూ.. 'సినిమా మొదలవడానికి ముందే స్పష్టంగా చెప్పా. నేను ఎవరి పేర్లూ బయటపెట్టనని. ఎందుకంటే నా కథలో ప్రతినాయకులు ఎవరూ ఉండకూడదు' అని ధోనీ స్పష్టం చేశాడు. అయితే, 'ధోనీ'కి సీక్వెల్ తీస్తే మాత్రం ప్రతినాయకులు ఉంటారని చెప్పడం గమనార్హం.