హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తన చివరి ఐపీఎల్ని ఆడుతున్నాడా అంటే అవుననే అంటున్నారు ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్. శనివారం ధోనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ధోని వయసు రీత్యా ఐపీఎల్-2017 అతనికి ఆఖరి సీజన్ కావచ్చని, వచ్చే ఏడాది ఈ టోర్నీలో ఆడకపోవచ్చని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ధోని ఆటతీరుని విమర్శిస్తున్న వారిపై మండిపడుతూనే, ఛాంపియన్ ఆటగాడి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ధోనికి పేరుంది. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించింది. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.
దీంతో తొలిసారి ఐపీఎల్లో ధోని సాధారణ ఆటగాడిగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో బ్యాట్స్మన్గా ధోని నిలకడగా రాణించలేకపోతున్నాడు. దీంతో ధోని బ్యాటింగ్ సామర్థ్యంపై కొందరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాంటింగ్ స్పందించాడు.
'ధోనీ సుదీర్ఘకాలం గొప్ప విజయాలు అందించాడు. ఎన్ని విజయాలు సాధించినా కెరీర్లో క్షీణదశ ఉంటుంది. నా కెరీర్లోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. నాపైనా విమర్శలు వచ్చాయి. అయితే చాంపియన్ ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడవద్దు' అని అన్నాడు.