కొలంబో: ఇటీవలి తన శ్రీలంక పర్యటనలో భాగంగా ఓ సభలో ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరును ప్రస్తావించారు. దీంతో ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
భారత్, శ్రీలంక తమిళుల ప్రజల మధ్య ఉన్న సంబంధాలపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. టెస్టులు, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును తన పేరున లిఖించుకున్న ముత్తయ్య పేరును గుర్తు చేసుకున్నారు.
తమిళులు మురళీధరన్, ఎంజీఆర్ వంటి వారిని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చారని మోడీ అన్నారు.
మోడీ నోటి వెంట తన పేరు రావడం తనకు సంభ్రమాశ్చర్యాన్ని కలిగించిందని, తనకు దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటని మురళీధరన్ అన్నాడు.
భారత్తో తనకు ఎంతో దగ్గరి సంబంధం ఉందని, చెన్నైకి చెందిన మధుమలర్ రామమూర్తిని తాను వివాహం చేసుకున్నానని ఈ సందర్భంగా మురళీధరన్ చెప్పాడు.
తన పూర్వీకులు భారత్ నుంచే లంకకు వచ్చారని, ఇప్పుడు తాను అయిదవ తరం వాడినని చెప్పాడు. శ్రీలంకకు భారత్ ఎప్పుడూ పెద్దన్న వంటిదన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధాని తన పేరును తన ప్రసంగంలో చెప్పడం, అదీ తన కమ్యూనిటీని కొనియాడటం గొప్ప విషయని మురళీధరన్ అన్నాడు.