హైదరాబాద్: లోథా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, బోర్డు ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ జడ్జిల సూచనలతో బీసీసీఐ మెరుగ్గా ఉంటుందని కోర్టు భావిస్తే మంచిదేగా అంటూ వెటకారంగా వ్యాఖ్యానించాడు.
ఆల్ ద బెస్ట్ అంటూ వ్యంగం: వేటుపై అనురాగ్ ఠాకూర్ స్పందన
'ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు.. బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కోసమే ఇన్నాళ్లూ పోరాడాను. అందరిలాగే నేనూ సుప్రీం కోర్టును గౌరవిస్తాను. మాజీ న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో బీసీసీఐ మరింత మెరుగైన పాలన ఇస్తుందని సుప్రీం కోర్టు భావిస్తే, వాళ్లకు ఆల్ ది బెస్ట్. వాళ్ల సలహాలు, సూచనలతో బీసీసీఐ మరింత వర్ధిల్లుతుందన్న విశ్వాసముంది' అని అన్నాడు.
ఇక అజయ్ షిర్కే మాత్రం బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐతో తనకు వ్యక్తిగత సంబంధం ఏమీ లేదన్నాడు. ఈ పదవిని వదిలేయడం వల్ల తనకు ఏమీ నష్టం ఉండదని చెప్పాడు. తనకు చాలా పనులున్నాయని, వాటిని చూసుకునే సమయం కూడా ఆసన్నమైందని తెలిపాడు.
'చెప్పడానికేమీ లేదు. బీసీసీఐని వదిలి నన్ను వెళ్లిపోమని సుప్రీం ఆదేశించింది. బీసీసీఐలో నా పాత్ర ముగిసింది. ఈ పదవితో నాకేమీ వ్యక్తిగతంగా అనుబంధం లేదు. నాకు వేరే పనులు చాలా ఉన్నాయి. గతంలోనే నేను ఓసారి రాజీనామా చేశాను. ఆ తర్వాత మళ్లీ పోస్ట్ ఖాళీగా ఉంటే, ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఈ పదవిలోకి వచ్చాను. ఈ పదవిని వీడుతున్నందుకు నాకెలాంటి బాధా లేదు' అని షిర్కే పేర్కొన్నాడు.