బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9 ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాను అర్ధశతకంతో రాణించినప్పటికీ కీలక సమయంలో ఔటవడం కొంత నిరాశకు గురిచేసిందని అన్నాడు.
తాను, ఆ తర్వాత కీలక ఆటగాడైన ఏబి డివిలియర్స్ ఔటవడంతో మ్యాచ్ తమ నుంచి చేజారిపోయిందని తెలిపాడు. ఒక వేళ తమలో ఏ ఒక్క ఆటగాడు ఔటవకపోయినా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని కోహ్లీ పేర్కొన్నాడు.
'ఈ సీజన్లో మా ఆట చాలా బాగుంది. అందుకు నేను గర్వపడుతున్నా. బెంగళూరు ప్రజలు మా జట్టుకు అన్నివేళలా మద్దతుగా నిలిచారు. ఫలితాలతో సంబంధం లేకుండా వారు మమ్మల్ని అభిమానించారు. ఫైనల్లో వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గలేదు. కానీ, నేను, ఏబి డివిలియర్స్ ఔటవడంతో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించింది. ఏబి డివిలియర్స్, నేను కాసేపు క్రీజులో ఉండివుంటే ఫలితం మరోలా ఉండేది' అని కోహ్లీ తెలిపాడు.
ఐపిఎల్లో అత్యధికంగా 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకోవడంపై ప్రశ్నించగా..'ఇదొక అదనపు ప్రోత్సాహకం. మేము విజేతలై ఉంటే ఈ ఆనందం రెట్టింపుగా ఉండేది. హైదరాబాద్ పటిష్టమైన బౌలింగ్తో మా జట్టును కట్టడి చేసింది. నేను జట్టు విజయం కోసమే పరుగులు చేశాను. రికార్డులనేవి బ్రేక్ కావాల్సిందే'అని కోహ్లీ పేర్కొన్నాడు.
నాలుగు శతకాలపై స్పందిస్తూ.. 'నాకు నేనే ఆశ్చర్యపోయా. ఓపెనింగ్లో రావడం వల్లే ఇది సాధ్యమైంది. 3 లేదా 4 స్థానాల్లో వచ్చివుంటే ఇవి సాధ్యమయ్యేవి కాకపోవచ్చు. అలాగే అత్యధిక సిక్సులు బాదడం కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఈ అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇక నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఐపిఎల్ విజేత అయిన జట్టు మాట్లాడాలి' అని తెలిపాడు.
కాగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ కటింగ్ మాట్లాడుతూ.. జట్టు విజయంలో భాగస్వామినైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. చివరి ఓవర్ ప్రత్యేకమైనదని తెలిపాడు. బెంగళూరు కూడా బాగా ఆడిందని చెప్పాడు. రెండు ప్రపంచ కప్ టోర్నీలను అందించిన యువరాజ్ సింగ్ తమ జట్టులో ఉన్నాడని, తమ జట్టుకే ఐపిఎల్ టోర్నీ రావడంతో యూవీ కూడా సంతోషం వ్యక్తం చేశాడని తెలిపాడు.
తనకు, తన జట్టుకు ఇదొక గొప్ప సీజన్ అని హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. డేవిడ్ వార్నర్ తొలి మ్యాచ్ నుంచి జట్టును ముందుండి నడిపించాడని చెప్పాడు. తమ జట్టు సమతూకంగా ఉందని తెలిపాడు. కటింగ్ 2,3 మ్యాచ్లే ఆడినా బాగా ఆడాడని తెలిపాడు. తమ జట్టుకు విజయాన్నందించేందుకు తనవంతు కృషి చేశానని బౌలర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ప్రశాంతంగా ఉండి కొన్నిసార్లు యార్కర్లు వేయాలని వార్నర్ సూచించాడని తెలిపాడు.