ముంబై: బీసీసీఐని సుదీర్ఘకాలం పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నారు. ఐసీసీ అధ్యక్షుడి పదవి హోదా నుంచి ఆయన్ను తప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ దిశగా కొత్తగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన శశాంక్ మనోహర్, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ దృష్టి సారించారని తెలుస్తోంది. 2014లో రెండేళ్ల పదవీ కాలానికి ఐసీసీ ఛైర్మన్గా శ్రీనివాసన్ ఎంపికయ్యారు. దీనిని బట్టి వచ్చే ఏడాది వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయితే ఈ పదవిని శ్రీనివాసన్ బీసీసీఐ ప్రతినిధి హోదాలో పొందారు. ఐసీసీలో తన ప్రతినిధిని మారుస్తూ బీసీసీఐ ఏకగ్రీవ తీర్మానం చేస్తే, ఛైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్ తప్పుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ దిశగా శశాంక్ మనోహర్, అనురాగ్ ఠాకూర్లు పావులు కదుపుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికను బీసీసీఐ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 9న జరగనున్న ఐసీసీ ఏజీఎం భేటీలో ఈ మేరకు బీసీసీఐ తన ప్రణాళికను ఐసీసీ ముందుంచనున్నట్లు తెలిపారు.
ఈ మార్పుకు గల కారణం ఏంటని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియా మరణంతో బీసీసీఐని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రస్తుత అధ్యక్షుడు శశాంక్ పూనుకున్నారని తెలిపారు. ఇందుకు గాను అనురాగ్ ఠాకూర్ కూడా తన మద్దతుని తెలిపారు. ఐసీసీ ఛైర్మన్గా శ్రీనివాసన్ పెద్దగా ప్రభావం చూపించడం లేదని పేర్కొన్నారు.
శ్రీనితో పాటు మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, శివరామకృష్ణన్ సైతం తమ తమ కాంట్రాక్టులను కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న వరల్డ్ టీ-20 టోర్నమెంట్ నేపథ్యంలో బీసీసీఐ, ఐసీసీ మధ్య అభిప్రాయబేధాలు రావడమే ఇందుకు అసలు కారణమని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సుదీర్ఘకాలం పాటు బీసీసీఐ తన ఆధిపత్యాన్ని కొనసాగించిన శ్రీనివాసన్కు చెక్ పెట్టనున్నారు.