హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్లు నవంబర్ 30న చంఢీగడ్లో సిక్కు సంప్రదాయ ప్రకారం ఆ తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సాంప్రదాయ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండుసార్లు వివాహం చేసుకున్న ఈ జోడి డ్యాన్స్లతో అదరగొడుతోంది.
శుక్రవారం గోవాలో యువీ, హాజెల్ కీచ్లు హిందూ సంప్రదాయం ప్రకారం రెండోసారి వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో యువరాజ్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, పలువురు మాజీ క్రికెటర్లు మాత్రమే పాల్గొన్నారు.
అయితే పెళ్లి కోసం గోవాకు చేరుకున్న యువరాజ్ సింగ్ దంపతులు గోవా ఎయిర్ పోర్టులో డాన్స్తో అలరించారు. వీరిద్దరూ కూడా పోటీపడి మరీ భాంగ్రా డ్యాన్స్ చేశారు. గోవాలో జరిగిన యువరాజ్ పెళ్లికి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు.
గోవాలో యువీ రెండోసారి వివాహం జరగడానికి ఓ కారణం ఉంది. హాజెల్ కీచ్ తల్లి భారతీయులు. అంతేకాదు బీహార్కు చెందిన హిందువు కాగా, తండ్రి బ్రిటన్ వాసి. దీంతో ఇరు కుటుంబ సభ్యుల కోరిక మేరకు యువరాజ్, హాజెల్ల వివాహాన్ని సిక్కు, హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.
ఇక, డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్కు ప్రధాని నరేంద్ర మోడీతో సహా బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హాజరవుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే గురుద్వారాలో వివాహ అనంతరం హాజెల్ కీచ్ పేరును 'గుర్బసంత్ కౌర్'గా మార్చినట్లు సమాచారం.