లండన్:2019లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది. క్రికెట్ను మరింత మంది అభిమానులకు చేరువ చేసేందుకు గాను టెస్టు మ్యాచ్లను నాలుగు రోజులకు కుదించి, వరల్డ్ కప్లో వన్డే మ్యాచ్లను 40 ఓవర్లకు ఆడించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఆమోదం తెలిపింది. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్కు మరింత ఊపునిచ్చేందుకు ఈ మార్పులు ఉపకరిస్తాయని ఈసీబీ పేర్కొంది.
గత 30 సంవత్సరాలుగా టెస్టు క్రికెట్లో ఐదు రోజుల ఫార్మెట్ను నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆరు రోజులు ఆడిన సందర్భాన్ని గుర్తు చేశారు. 1979 నుంచి కూడా టెస్టు క్రికెట్ను ఐదు రోజులు ఆడుతున్నారు. కాన్పూర్లో ఇండియా-వెస్టిండిస్ మధ్య టెస్టు మ్యాచ్ ఆరు రోజులు జరిగింది.
అంతర్జాతీయ క్రికెట్లో ఈ సమూల మార్పుల కారణంగా టెస్టు క్రికెట్కు కొత్త రూపం సంతరించుకుంటుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధ్యక్షుడు గైల్స్ క్లార్క్ తన పరపతిని ఉపయోగించి ఐసీసీతో మాట్లాడి మరీ ఈ మార్పులకు అంగీకరించేలా చేశారు.