ముంబై: టీమిండియా హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసిన సీఏసీ కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పాత్రపై బీసీసీఐ క్లారిటీ ఇస్తూ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే సీఏసీ కమిటీ సూచన మేరకు టీమిండియా హెడ్ కోచ్గా బీసీసీఐ కుంబ్లేని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
అయితే కుంబ్లే పేరుని కమిటీలో సభ్యుడిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ సూచించడం వెనుక 'పరస్పర ప్రయోజన' కోణం కనిపిస్తున్నట్లుగా ఉందని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చిన సందర్భంలో బీసీసీఐ స్పందించింది. కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్కు వాటాలు ఉన్న కారణంగా అతనిపై 'పరస్పర ప్రయోజనం' కింద చర్య తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని బోర్డు స్పష్టం చేసింది.
ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడైన లక్ష్మణ్కు కుంబ్లే కంపెనీలో ఎటువంటి షేర్లు లేవని.. హెడ్ కోచ్ ఎంపికలో లక్ష్మణ్ ఎటువంటి ఆసక్తిని కనబర్చలేదని ఆయన తేల్చి చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత 2011లో టెన్విక్ స్పోర్ట్స్ పేరిట బెంగుళూరులో అనిల్ కుంబ్లే ఓ కంపెనీని పెట్టాడు. ఈ కంపెనీలో వీవీఎస్ లక్ష్మణ్ 2012లో 16,666 ఈక్విటీ షేర్లను కోనుగోలు చేశాడు. ఆ షేర్లు ఏడాది ప్రారంభం నాటికి రెట్టింపయ్యాయి.
Also Read: కోచ్ ఎంపికలో ట్విస్ట్, కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్కు షేర్లు
ప్రస్తుతం టెన్వీ స్పోర్ట్స్లో లక్ష్మణ్కు 33,332 షేర్లు ఉన్నాయని, తాను పెట్టుబడిన పెట్టిన కంపెనీ అధినేతగా ఉన్నందునే లక్ష్మణ్ కోచ్ పదవికి కుంబ్లేని ఎంపిక చేశారంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. టెన్విక్ స్టోర్స్ కంపెనీలో లక్ష్మణ్కు ఉన్న5 శాతం షేర్లను మార్చి 2016లో అమ్మేసినట్లు బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేకాదు టెన్విక్ స్పోర్ట్స్తో వీవీఎస్ లక్ష్మణ్కు అధికారికంగా గానీ లేదా అనధికారికంగా ఎటువంటి సంబంధం లేదని అందులో పేర్కొంది. ఈ విషయం బీసీసీఐకి ముందుగానే తెలుసని, ఆ తర్వాతనే వీవీఎస్ లక్ష్మణ్ను కమిటీలో నియమించామని పేర్కొన్నారు.
టీమిండియా హెడ్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లేని ఎంపిక చేసే సమయానికి టెన్విక్ స్పోర్ట్స్తో లక్ష్మణ్కు ఎటువంటి సంబంధం లేదని, ఇందులో ఇద్దరి మధ్య 'పరస్పర ప్రయోజనం' అనే అంశానికి తావే లేదని ఆయన పేర్కొన్నారు. వీవీఎస్ లక్ష్మణ్పై వచ్చిన వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని కొట్టి పారేశారు.