హైదరాబాద్: బీసీసీఐకి ఇప్పుడే కొత్త పాలకులను నియమించవద్దని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుని కోరారు. ఈ నిర్ణయాన్ని కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు. బీసీసీఐలో జస్టిస్ లోధా కమిటీ సంస్కరణల వల్ల అంతర్జాతీయంగా భారత క్రికెట్పై పెను ప్రభావం చూపుతుందని కోర్టుకు నివేదించారు.
24న బీసీసీఐకి కొత్త చీఫ్: ఆ 9 మందిలో ఎవరు?
అంతేకాదు కేంద్రం కొత్త స్పోర్ట్స్ కోడ్ను తీసుకువచ్చే ఆలోచనలో ఉందని రోహత్గీ వెల్లడించారు. అధ్యక్ష కార్యదర్శుల తొలగింపుతో ఐసీసీలో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. ఆయన వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. 'జులైలో మేం ఆ ఆదేశాలు ఇచ్చినప్పుడు మీరెక్కడున్నారు?' అని ధర్మాసనం ప్రశ్నించింది.
మరోవైపు గత శుక్రవారం సుప్రీం కోర్టు నియమించిన అనిల్ దివాన్, గోపాల్ సుబ్రమణియన్లు 9 మంది పేర్లను బీసీసీఐ పాలకుల కోసం ప్రతిపాదించింది. అయితే తొమ్మిది మంది చాలా ఎక్కువని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు జనవరి 24 (గురువారం) వారి పేర్లను ప్రకటిస్తామని చెప్పింది. అయితే అమికస్ క్యూరీ ప్రతిపాదించిన పేర్లలో 70 ఏళ్లకు పైబడి ఉన్నవాళ్లను పరిశీలించబోమని సుప్రీం స్పష్టం చేసింది.
ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ సమావేశంలో ప్రాతినిధ్యం వహించేందుకు ముగ్గురు వ్యక్తుల పేర్లను శుక్రవారంలోగా తెలియజేయాలని బీసీసీని ఆదేశించింది. ఈ క్రమంలో బీసీసీఐ బోర్డు అడ్మినిస్ట్రేషన్ కోసం తాము కూడా కొన్ని పేర్లను ప్రతిపాదిస్తామని బీసీసీఐ కోర్టును కోరింది.
కొన్ని పేర్లను సీల్డ్ కవర్లో అందించాలని బీసీసీఐ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ను కోర్టు ఆదేశించింది. కొత్తగా బోర్డు ఎన్నికలు ఎన్నికలు జరిగే వరకు తాత్కాలిక కమిటీ ఏర్పాటుకు సూచనలిచ్చేందుకు కపిల్ సిబల్కు అనుమతి ఇచ్చింది. ఎలాంటి నిర్ణయం లేకుండా విచారణ జనవరి 30కి వాయిదా పడింది.
గత శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శుల తొలగింపుపై సుప్రీం తీర్పుని పునరాలోచించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. చాలా సమస్యలకు ఇంకా పరిష్కారాలు దొరకలేదని, జులై 18 తీర్పును ఉపసంహరించుకోవాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీంతో లోధా కమిటీ సిఫారసుల అమలుపై గతంలో ఇచ్చిన తీర్పులో మార్పులు చేర్పులు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.
జులై 18 తీర్పు ప్రకారం రాష్ట్ర సంఘం, బీసీసీఐలో కలిపి మొత్తం తొమ్మిదేళ్లు పదవుల్లో ఉంటే భవిష్యత్తులో ఎలాంటి పదవులు చేపట్టరాదు. అయితే శుక్రవారం సుప్రీం కోర్టు చేసిన మార్పుల ప్రకారం ఇకపై రాష్ట్ర సంఘాల్లో తొమ్మిదేళ్లు, బీసీసీఐలో తొమ్మిదేళ్లు పదవుల్లో ఉండొచ్చు.