హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్ధాన్ జట్టుపై తనదైన శైలిలో పంచ్ విసిరాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం పాకిస్థాన్ జట్టుపై తాను చేసిన డబుల్ సెంచరీని గుర్తు చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
2006లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్పై సెహ్వాగ్ 254 పరుగులు చేశాడు. కేవలం 182 బంతుల్లో డబుల్ సెంచరీని చేసిన సెహ్వాగ్ అత్యంత వేగంగా డబుల్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
దస్ గుణ లగాన్ వసూల్: 350 ఛేజింగ్పై సెహ్వాగ్ ట్వీట్
సోమవారం ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సరిగ్గా 11 ఏళ్ల కిందట పాకిస్థాన్ కా బూత్ బనాయా దివస్ జరుపుకొనే అవకాశం తనకు దక్కినట్లు సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. 2006లో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్లింది.
11 years ago, had the privilege to celebrate #PakistanKaBhootBanaya Diwas ! pic.twitter.com/r9pmcbzohi
— Virender Sehwag (@virendersehwag) January 16, 2017
లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 679 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో యూనిస్ఖాన్, మహ్మద్ యూసుఫ్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్లు సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 410 పరుగులు జోడించారు.
తొలి వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వినూ నమ్కడ్-పంకజ్ రాయ్ల రికార్డుని కేవలం మూడు పరుగుల తేడాతో మిస్సయ్యారు. ఈ మ్యాచ్లో సెహ్వాగ్ 247 బంతులను ఎదుర్కొని 254 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు.
అయితే చివరి రోజు వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ సిరీస్ చివరి టెస్టులో ఓటమిపాలై సిరీస్ను 0-1తో భారత్ కోల్పోయింది. పాకిస్థాన్తో టెస్టు మ్యాచ్ అంటేనే చాలు సెహ్వాగ్ చెలరేగిపోయేవాడు. పాకిస్థాన్పై సెహ్వాగ్ యావరేజి 91 ఉండటమే ఇందుకు నిదర్శనం.