హైదరాబాద్: టెస్టు క్రికెట్ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తెరదించాడు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరిస్ అనంతరం తాను టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు.
గత కొన్ని నెలలుగా మోచేతి గాయంతో బాధపడుతున్న ఏబీ డివిలియర్స్ ఇప్పటివరకు తనకు రిటైర్మెంట్ ఆలోచనే రాలేదని విషయాన్ని అభిమానులు గ్రహించాలని అన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి ఏబీ డివిలియర్స్ వైదొలగిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్లో తాత్కాలిక కెప్టెన్గా కెప్టెన్గా ఉన్న డుప్లెసిస్కు పూర్తి బాధ్యతలు కట్టబెట్టడంతో అతని రిటైర్మెంట్కు సంబంధించి రూమర్లు వచ్చాయి. ఈ రూమర్లను ఏబీ డివిలియర్స్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఖండించాడు.
తన మోచేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఇంటి వద్దనే ఉంటున్నానని... తాను త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలో న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కు తాను అందుబాటులో ఉండటం లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు.
'నా దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టాలనేది నా కోరిక. అది నేరవేర్చిన తర్వాతే క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలనుకుంటున్నా. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ క్రికెట్ ఆడతా. ఇక్కడ అభిమానులు మరొక విషయం కూడా గుర్తించాలి. 2019 వరల్డ్ కప్ వరకూ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. నేను ఏ ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలని అనుకోవడం లేదు. ఆ మేరకు ప్రణాళికలు కూడా ఏమీ లేవు' అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం తన దృష్టంతా 2019 వరల్డ్ కప్పైనే ఉందని అన్నాడు. 'నా వరకు 2019 వరల్డ్ కప్ ఎంతో ముఖ్యం. ఎలాగైనా సరే ఈసారి వరల్డ్ కప్ని సాధించాలి. అప్పటివరకు శారీరకంగా, మానసికంగా తన అత్యుత్తమ ఆటతీరుని ప్రదర్శిస్తాను' అని డివిలియర్స్ తెలిపాడు.