కోల్కత్తా: భారత్లో ఉన్న అభిమానుల పట్ల పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రీది చేసిన వ్యాఖ్యలకు ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ మద్దతు తెలిపారు. షాహిద్ అఫ్రీది చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదని, కేవలం తన ఎమోషన్స్ను మాత్రమే తెలియజేశాడని పేర్కొన్నాడు.
కాగా, ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా భారత్కు వచ్చిన పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రీది మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్లో కన్నా భారత్లోనే తమను ప్రేమించే అభిమానులు ఎక్కువ అని వ్యాఖ్యానించి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై వకార్ యూనిస్ మాట్లాడుతూ అఫ్రీది వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదన్నారు. ఆ వ్యాఖ్యలు కేవలం అతడి ఎమోషన్స్ను తెలియజేశారన్నారు. ఇక్కడ క్రికెట్ ఆడేందుకు వచ్చామన్నారు. క్రికెట్పై ఫోకస్ పెట్టడమే మంచిదనేది తమ అభిప్రాయమన్నారు.
ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా పాకిస్థాన్ జట్టు బుధవారం నాడు బంగ్లాదేశ్తో కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో తలపడనుంది. ఈ క్రమంలో మ్యాచ్కు ముందు కోచ్ మీడియాతో మాట్లాడుతూ మా జట్టు కుర్రాళ్లకు కేవలం ఒకటే చెప్పానన్నారు.
దేశం కోసం క్రికెట్ ఆడాలని చెప్పానన్నారు. సెక్యూరిటీ కారణాల వల్లే భారత్ పర్యటనకు రావడం ఆలస్యమైందన్నారు. అఫ్రీది భారత అభిమానుల పట్ల చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ వ్యాప్తంగా విమర్శలు వెల్లవెత్తాయి. అఫ్రీది కామెంట్లు తనను తీవ్రంగా బాధించాయని ఆ దేశ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇలాంటి ప్రకటనలు చేసినందుకు సిగ్గుపడాలన్నాడు. వరల్డ్ టీ20 కోసం పాకిస్థాన్ జట్టు భారతకు వెళ్లింది కానీ.. ఆతిథ్య దేశానికి భజన చేయమని కాదని మియాందాద్ విరుచుకుపడ్డాడు. అయితే భారత అభిమానుల మనసు గెలవడానికి అఫ్రీది తెలివిగా వ్యవహరించాడని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చెప్పాడు.
కాగా అఫ్రీది వ్యాఖ్యలు పాకిస్థానీయుల మనోభావాలను గాయపర చడం, దేశద్రోహానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ ఓ సీనియర్ న్యాయవాది పాకిస్థాన్ లాహోరు కోర్టులో కేసు వేశాడు. అఫ్రీది, పాక్ బోర్డు అధికారి నజమ్ సేథీకి నోటీసులు పంపినట్టు చెప్పాడు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై అఫ్రీది సైతం వివరణ ఇచ్చుకున్నాడు.