హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. 441 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 12 ఏళ్ల తర్వాత భారత్లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ గెలిచింది.
ఆస్ట్రేలియా విజయం వెనుక స్పిన్నర్ స్టీఫెన్ ఓకీఫ్ కీలక పాత్ర పోషించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత పర్యటనకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చాడు. పూణె టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు.
భారత్లోని పిచ్లు అనుకూలిస్తాయి కాబట్టే ఓకీఫ్కు ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పించారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పూణె టెస్టులో ఒక్కసారిగా ఓకీఫ్ రాణించడంతో హీరోగా మారిపోయాడు. 12 ఏళ్ల తర్వాత భారత్లో ఆసీస్ మ్యాచ్ గెలవడంలో ఓకీఫ్ పోషించిన పాత్ర అమోఘం.
స్వదేశంలో వరుసగా 20 టెస్టుల్లో ఓటమి అనేది ఎరుగకుండా దూసుకుపోతున్న భారత్కు పూణె టెస్టు పరాజయం గట్టి షాక్ అనే చెప్పాలి. పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్లో 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన ఓకీఫ్ రెండో ఇన్నింగ్స్లో కూడా 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.
తద్వారా తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓకీఫ్ ఆస్ట్రేలియన్ మాజీ దిగ్గజాల సరసన చేరాడు. భారత్లో 2008లో నాగ్ పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్ స్పిన్నర్ జాసన్ క్రేజా 12-358 నమోదు చేసిన రికార్డుని సైతం ఓకీఫ్ అధిగమించాడు.
Steve O'Keefe produced an incredible spell of bowling on day two in Pune. Here's how it all unfolded: https://t.co/UWVHn8apBP #INDvAUS pic.twitter.com/rUqQtAMwrI
— cricket.com.au (@CricketAus) 24 February 2017
మరోవైపు భారత్లో ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఓకీఫ్ నిలిచాడు. ఈ రికార్డు పరంగా ఇంగ్లండ్ మాజీ పేసర్ ఇయాన్ బోథమ్ ముందు వరుసలో ఉన్నాడు. 1980, ఫిబ్రవరి 15వ తేదీన భారత్తో ముంబైలో జరిగిన టెస్టులో ఇయాన్ బోథమ్ ఒక టెస్టు మ్యాచ్ లో 13 వికెట్లు సాధించాడు.
ఆ తర్వాత వరుసగా ఓకీఫ్ రెండో బౌలర్గా గుర్తింపు పొందాడు. ఆపై ఫజాల్ మొహ్మద్ (పాకిస్తాన్), ఏమీ రాబర్ట్స్ (వెస్టిండీస్), డేవిడ్ సన్ (ఆస్ట్రేలియా)లు ఉన్నారు. తాజా విజయంతో నాలుగు టెస్టుల సిరిస్లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. దీంతో పాటు 2004 తర్వాత భారత్లో ఆసీస్ విజయం సాధించింది.