పూణె: తొలి మ్యాచు విజయానికి ఆస్ట్రేలియా పొంగిపోతుంటే, ఓటమికి ఇండియా తీవ్ర ఆవేదనకు గురవుతోంది. తొలి టెస్టు మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడిన తీరే దానికి అద్దం పడుతోంది. ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచులో 333 పరుగుల భారీ తేడాతో భారత్ను ఓడించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నాడు. ఊహించని విధంగా మ్యాచ్ ఫలితం వచ్చిందని అన్నాడు. తాము బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యామనే విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుందని అన్నాడు.
గత రెండేళ్ల కాలంలో ఇది తమ అతి చెత్త బ్యాటింగ్ అని చెప్పాడు. తామంతా కూర్చుని ఈ ఓటమిపై చర్చించుకోవాల్సి ఉందని, చేసిన తప్పులను సమీక్షించుకోవాల్సి ఉందని అన్నాడు. జట్టుతో పాటు వ్యక్తిగతంగా తనకు కూడా ఈ ఓటమి మంచి పాఠమని అన్నాడు.
తప్పించుకోవడానికి లేదని, ఈ ఓటమికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని చెప్పాడు. మ్యాచ్లో తిరిగి కోలుకోవడం సాధ్యపడలేదని అన్నాడు. కొన్నిసార్లు కెప్టెన్గా చేయాలనుకున్నది చేయలేక చేయిదాటిపోయే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా తొలి టెస్టు గెలిచి 1-0తో ముందంజలో ఉండగా రెండో టెస్టు మ్యాచు బెంగళూరులో మార్చి 4 నుంచి మొదలుకానుంది.