హైదరాబాద్: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేధం విధించింది. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్లో బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టినందుకు ఇర్ఫాన్పై పీసీబీ ఏడాదిపాటు నిషేధం విధించడంతో పాటు రూ.65 వేల జరిమానా కూడా విధించింది.
ఇర్ఫాన్ తన తప్పును అంగీకరించాడు. దేశ ప్రజలను క్షమాపణ కోరాడు. పీసీబీ నియమావళి ప్రకారం ఇలాంటి వాటిపై వెంటనే ఫిర్యాదు చేయకపోతే చర్య తీసుకునేందుకు ఆస్కారముంటుంది. అయితే అతను మాత్రం ఎలాంటి ఫిక్సింగ్కు పాల్పడలేదని పీసీబీ స్పష్టం చేసింది.
లాహోర్లో జరిగిన పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇర్ఫాన్పై స్పాట్ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో బుకీలు తనను కలిసిన మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేసినట్లు ఇర్ఫాన్ అంగీకరించాడు.
అయితే ఈ విషయంలో అతను ఎలాంటి నేరం చేయలేదని, బుకీల సమాచారాన్ని బోర్డుకు అందించడంలో విఫలమయ్యాడని పీసీబీ అవినీతి నిరోధక విభాగం అధికారులు వెల్లడించారు. తల్లి మరణంతో మానసికంగా కుంగిపోయి, బుకీల విషయాన్ని పీసీబీకి చెప్పలేకపోయినట్లు ఇర్ఫాన్ చెప్పడంతో అతడికి తక్కువ శిక్షను విధించింది.
పాకిస్థాన్ దేశవాళీ టీ20 టోర్నీ పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటికే పలువురు జాతీయ జట్టు ఆటగాళ్లపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వేటు వేసిన సంగతి తెలిసిందే.