హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో తన క్రికెట్ భవితవ్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో తాడో పేడో తేల్చుకునేందుకు ఆ దేశ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ సిద్ధమయ్యాడు. గత నెలలో టెస్టు కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలని బోర్డుని ప్రశ్నించిన హక్, తాజాగా అసలు బోర్డుకు తన అవసరం ఉందా? లేదా అనే విషయంపై తేల్చుకోనున్నాడు.
ఇందులో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ను మరో రెండు రోజుల్లో కలిసి తన కెప్టెన్సీ పదవిపై మాట్లాడనున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరుపున ఆడుతున్న మిస్బా త్వరలో వెస్టిండీస్తో సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో తన కెప్టెన్సీపై తుది నిర్ణయాన్ని షహర్యార్కే వదిలేయనున్నట్లు తెలిపాడు.
'వెస్టిండిస్తో జరిగే సిరిస్కు ఆటగాడిగా అందుబాటులో ఉంటా. అదే క్రమంలో కెప్టెన్ గా నేనే ఉంటానా? లేక ఎవరినైనా ఎంపిక చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఆ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ నిర్ణయిస్తారు. దీనిపై మరో రెండు రోజుల్లో కలుస్తున్నా' అని హక్ పేర్కొన్నాడు.
ఈ పరిస్థితుల్లో షహర్యార్తో మిస్బా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోమని బోర్డు ఆదేశించిన పక్షంలో ఆటగాడిగా కూడా వీడ్కోలు చెప్పాలని మిస్బా నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
త్వరలో వెస్టిండిస్ పర్యటనకు వెళ్తున్న పాకిస్థాన్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడనుంది. పాకిస్థాన్ జట్టు వెస్టిండిస్ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభం అవుతుంది.