హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్లలో క్రమశిక్షణారాహిత్యానికి మారుపేరుగా నిలిచే సంఘటన మరోటి చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ ప్రాక్టీసు సందర్భంగా పాకిస్ధాన్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు తన్నుకున్నారు. గొడవకు కారణాలేంటో తెలియరాలేదు.
ప్రాక్టీస్లో భాగంగా పుట్ బాల్ ఆడుతున్న క్రమంలో పాక్ బౌలర్లు వాహబ్ రియాజ్-యాసిర్ షాల మధ్య మాటా మాటా పెరిగింది. ప్రాక్టీస్లో ఉన్న ఆటగాళ్లు ఒక్కసారిగా పిడి గుద్దులు గుద్దుకోవడంతో అక్కడే ఉన్న అంతర్జాతీయ మీడియా దీన్ని లైవ్లో చూపెట్టింది. ముందుగా యాసిర్ షా... వాహబ్ రియాజ్ ఛాతిపై పంచ్ ఇచ్చాడు.
ఇంతలో కోపద్రిక్తుడైన రియాజ్ తిరిగి యాసిర్ పై చేయి చేసుకున్నాడు. దీంతో గొడవ పెద్దదయ్యేలా కనిపించడంతో వెంటనే సహచరులు వారిని అడ్డుకున్నారు. వెంటనే స్పందించిన టీమ్ మేనేజర్ వసీమ్ బారీ ఆటగాళ్లను విడదీసి ప్రాక్టీస్ సెషన్ నుంచి బయటకు పంపించేశాడు.
ఈ విషయం పెద్దది కావడంతో వెంటనే పాకిస్థాన్ నష్ట నివారణ చర్యలకు దిగింది. వెంటనే ఇద్దరు ఆటగాళ్లతో మాట్లాడి ఓ వీడియో మెసేజ్ను సోషల్ మీడియాలో పెట్టింది. తామిద్దరం మంచి స్నేహితులమని, సరదాగా జరిగిన సంఘటనను మీడియా పెద్దది చేసిందని అందులో పేర్కొన్నారు.
ఈ మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ టీమ్ మేనేజర్ను ఆదేశించారు. ఇదిలా ఉండే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు బ్రిస్బేన్లోని గాబా వేదికగా జరగనుంది.
1988 నుంచి ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా ఓటమి పాలవలేదు. ఈ స్టేడియంలో ఇదే తొలి డే అండ్ నైట్ టెస్టు కావడం విశేషం. గతంలో సొంతగడ్డపై అడిలైడ్లో జరిగిన రెండు డే అండ్ నైట్ మ్యాచ్లలోనూ ఆసీస్ విజయం సాధించగా, యూఏఈలో వెస్టిండీస్తో ఆడిన తొలి డే అండ్ నైట్ మ్యాచ్లో పాకిస్ధాన్ గెలుపొందింది.
మరోవైపు ఆస్ట్రేలియాపై మి స్బావుల్హక్ నేతృత్వంలోని పాక్ జట్టుకు పేలవ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఆడిన 11 సిరీస్లలో పాకిస్థాన్ ఎప్పుడూ విజయం సాధించలేదు. గత మూడు సిరీస్లలో అయితే వరుసగా 0-3 తేడాతో మొత్తం 9 టెస్టులు ఓడింది. ఆసీస్ ఇప్పటి వరకు ఆడిన 27 టెస్టుల్లో 20 గెలిచి 7 డ్రా చేసుకుంది.
దీంతో ఈ టెస్టులో స్మిత్ సేన ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. అయితే తొలిసారి డే అండ్ నైట్ టెస్టు కావడంతో ఇక్కడ గులాబీ బంతి ఎలా స్పందిస్తుందనే దానిపై ఇరు జట్లకూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.